ముద్ర ప్రతినిధి, నిర్మల్:
పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లా పేరు నిలపాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకాంక్షించారు. లక్ష్మణచాందా మండలం వడ్యాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆమె శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించారు. నేరుగా తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. గణితం, ఇంగ్లీషు తదితర ముఖ్య విషయాలకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగి, వారి సమాధానాలను పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యంపై సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి లోను కాకుండా, ప్రణాళికా బద్ధంగా చదివి ఉన్నత శ్రేణి మార్కులు సాధించాలని సూచించారు. పాఠశాలలో ఉన్న వసతులు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును తెలుసుకున్నారు. ఆమె వెంట డీఈఓ భోజన్న, తహసిల్దార్ సరిత, ఎంపీడీవో రాధ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.