సింగరేణిలో అవినీతి ప్రతిపక్షం కట్టుకథ
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ప్రతిపక్ష నేతల ఆరోపణల్లో వాస్తవాలు లేవు
మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం
ముద్ర, ఖమ్మం :
సింగరేణి బొగ్డు టెండర్ల విషయంలో అవినీతి జరిగిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అవన్నీ ప్రధాన ప్రతిపక్షం అల్లుతున్న కట్టుకథలని పేర్కొన్నారు. ఈ నెల 26న రాత్రి తనతో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయిన విషయంపై అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. పిచ్చోళ్ల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.ఖమ్మం పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. తనతో మంత్రులు భేటీ కావడం సాధారణ విషయమేనని చెప్పారు. సమావేశం కాకూడదా? అని ప్రశ్నించారు. పాలనాపరమైన అంశాలపైనే అప్పుడప్పుడు అలా భేటీ అవుతుంటామని స్పష్టత ఇచ్చారు. మంత్రులు సీఎం లేదా డిప్యూటీ సీఎం వద్దకు వెళ్తుంటారన్నారు. సీఎం అందుబాటులో లేనందునే తనతో ఆయా విషయాలపై చర్చించేందుకు మంత్రులు వచ్చారని అన్నారు. తాను, సీఎం, మంత్రులు అంతా సమష్టిగా, ఉమ్మడి కుటుంబంలా పనిచేస్తున్నామని వివరించారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లో రిపీట్ అవుతాయని భట్టి అన్నారు. రాష్ట్రంలోని అన్ని పురపీఠాలపై కాంగ్రెస్ జెండా ఎగురుతుుందన్నారు. తమపై ఎవరు ఎలాంటి దుష్ప్రచారం చేసినా.. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే తమ ధ్యేయమని అన్నారు. తెలంగాణను 2047 కల్లా 3 ట్రిలియన్ ఎకానమీగా నిలిపేందుకు ఎలా ముందుకు వెళ్లాలన్నదే తమ ఆలోచన అని, ఇతర ఆలోచనలు తమకు లేవని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.