ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా రైతాంగం పరిస్థితి నానాటికి దిగజారుతోంది. తాజాగా సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షాల కారణంగా జిల్లాలోని పలు మండలాల్లో మొక్కజొన్న, పసుపు, మామిడి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మూడు రోజుల క్రితమే అకాల వర్షాల గురించి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా ఇంత భారీగా నష్టం జరుగుతుందని రైతాంగం ఊహించలేదు. ప్రధానంగా లక్ష్మణ చందా, పొనకల్, బైంసా, తానూర్, ఖానాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షంతో పాటు వడగళ్ళు పడడంతో పంటలు నేలమట్టమయ్యాయి. మొక్కజొన్న పంట చేతికందే సమయంలో ఈ వర్షాలు వారి ఆశలను నీరు గార్చాయి. ఈ సంవత్సరం రైతుబంధు కూడా ఇంతవరకు రాలేదు అలాగే యూరియా వంటి ఎరువుల కొరత కూడా రైతన్నను పట్టిపీడించింది ఇలాంటి తరుణంలో అప్పులు చేసి పంటలు సాగుచేసిన రైతన్నలకు రెండు గంటల పాటు కురిసిన వర్షాలు, వడగళ్ళు అతలాకుతలం చేశాయి. దిగుబడి మాట అటుంచి కనీసం పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి లేకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. ప్రభుత్వం పంట నష్టం పై యుద్ధ ప్రాతిపదికన సర్వే జరిపించి బాధితులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.