సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అందే గ్రామంలో బర్డ్ ఫ్లూ అనుమానంతో కలకలం రేగింది. గ్రామానికి చెందిన రంగనమైన కుమార్కు చెందిన పౌల్ట్రీ ఫారంలో సుమారు 7,700 కోళ్లు అకస్మాత్తుగా మృతి చెందాయి. కోళ్ల మృతితో రైతులు, గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పశుసంవర్ధక శాఖ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతిచెందిన కోళ్ల నమూనాలను సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటూ రైతులకు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. అధికారులు పూర్తి స్థాయి నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు.