ముద్ర, శేరిలింగంపల్లి :
సి.ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి, మాజీ శాసనసభ సభ్యులు, విశాలాంధ్ర మాజీ సంపాదకులు ,“చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి గలవోడా” గేయ రచయిత వేములపల్లి శ్రీకృష్ణ ఆయనకు 26వ వర్ధంతి సందర్బంగా ఘన నివాళి అర్పించారు.
చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు వేములపల్లి శ్రీకృష్ణ 26 వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ కొండాపూర్ లోని సి.ఆర్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి చెన్నమనేని వెంకటేశ్వర రావు వేములపల్లి శ్రీకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వేములపల్లి శ్రీకృష్ణ తన తుది శ్వాస వరకు సి.ఆర్ ఫౌండేషన్ స్థాపనలో చేసిన కృషిని, ఆయన రచంచిన “చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి గలవోడా” గేయం ప్రాచుర్యాన్నీ వక్తలు గుర్తు చేసుకున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా, శాసనసభ సభ్యునిగా, విశాలాంధ్ర సంపాదకుడిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమం డైరెక్టర్ సి.ఆర్ ఫౌండేషన్ కోశాధికారి వి. చెన్నకేశవరావు, ఆరోగ్య కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె. రజిని, మహిళా సంక్షేమ కేంద్రం డైరెక్టర్ జోశ్యభట్ల కల్పన, సభ్యులు కనపర్తి జ్యోస్న, ఐ ఎస్ రాజు. వృద్ధాశ్రమ వాసులు, తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.