ముద్ర ప్రతినిధి మెదక్:
పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు రెగ్యులర్ 99.83 శాతం, ప్రైవేట్ 64.29 శాతం విద్యార్థులు హాజరయ్యారని డిఈఓ విజయ తెలిపారు. రెగ్యులర్ 11239 ఉండగా 11220 హాజరుకాగా 19 మంది గైర్హాజరయ్యారు. ప్రైవేట్ 14 మంది విద్యార్థులు ఉండగా 9 మంది హాజరయ్యారు. అయిదుగురు గైర్హాజరయ్యారు.
నర్సాపూర్ లో పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని అదనపు కలెక్టర్ నగేష్ తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ సక్రమంగా జరుగుతున్న తీరు, పరీక్షా కేంద్రంలో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. పరీక్షా హాళ్లను సందర్శించి విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అవసరమైన ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, విద్యుత్, పరిశుభ్రత, భద్రత వంటి మౌలిక సదుపాయాలు సమృద్ధిగా ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. వెంట తహసీల్దార్ శ్రీనివాస్ ఉన్నారు.
మెదక్ పట్టణం, హవేలి ఘనపూర్ లో పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆర్డీఓ రమాదేవి సందర్శించారు. జిల్లా కేంద్రంలోని న్యూ హై స్కూల్, సెయింట్ డాన్ బాస్కో పాఠశాలలో తనిఖీ చేశారు.

పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు కల్పించిన మౌలిక సదుపాయాలు, తాగునీరు, కూర్చునే ఏర్పాట్లు, ఇతర అవసరమైన సదుపాయాలు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తహసిల్దార్ లక్ష్మణ్ బాబు, తదితరులున్నారు.
హవేలి ఘనాపూర్ మండల కేంద్రంలో గల హై స్కూల్, మహాత్మా జ్యోతిబా ఉన్నత పాఠశాల సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు. వెంట హవెళి ఘనపూర్ తహశీల్దార్ సింధు రేణుక తదితరులున్నారు.

అదనపు ఎస్పీ మహేందర్ మెదక్ పట్టణంలోని సిద్ధార్థ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్, సర్థన పాఠశాలలను తనిఖీ చేసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షలు పారదర్శకంగా, నిబంధనల ప్రకారం జరిగేలా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. తొలిరోజు పరీక్షలు జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా ముగిశాయని పేర్కొన్నారు.