సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :
ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకు వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకొని సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డి ప్రభత్వం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.

శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రివర్యులు సిద్దిపేట నియోజకవర్గంలోని ఐదు మండలాల లబ్ధిదారులకు 3 కోట్ల 42 లక్షల 39వేల రూపాయల విలువైన 342 కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకు వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకొని సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డి ప్రభత్వం కృషి చేస్తుందని తెలిపారు. 8 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉండి ప్రతినెల ఆ అప్పుకు మిత్తిగా రాష్ట్ర ఆదాయంలో 40 శాతం కడుతూ కూడా ప్రజా సంక్షేమానికి లోటు రాకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. మాట ఇచ్చిన ప్రకారం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని సిద్దిపేట నియోజకవర్గంలో చాలా చక్కగా ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలవుతుందని, లబ్ధిదారులకు ఇబ్బంది పడకుండా వెంట వెంటనే బిల్లుల చెల్లిస్తున్నామని తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఇల్లు కట్టుకున్న వారికి కూడా త్వరలోనే సాంక్షన్ ఇచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందని అన్నారు. కొత్త రేషన్ కార్డులను ఇచ్చామని త్వరలోనే అర్హత ఉన్న వారికి వృద్ధాప్య పెన్షన్లను కూడా ప్రభుత్వం మంజూరు చేయనుందని తెలిపారు. 13వేలకోట్ల రూపాయల ఖర్చు చేసి నిరుపేదలకు సన్న బియ్యం అందిస్తున్నామని, హైదరాబాదులో నిర్వహించిన సమ్మిట్ ద్వారా ఐదు లక్షల ఉద్యోగాలు రానున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా 119 అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నామని వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చాలా బాగుంటాయని అన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీలో 18 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సిద్దిపేట ఆర్డిఓ సదానందం, సిద్దిపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, కౌన్సిలర్లు, నాయకులు పూజల హరికృష్ణ, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.