ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
పెద్దకొత్తపల్లి మండలంలో తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (TSUTF) 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఎం.డి. గౌస్ పాషా జెండా ఆవిష్కరణ చేసి వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ లక్ష్యాలతో TSUTF సేవలు కొనసాగుతున్నాయని తెలిపారు. 1974 ఆగస్టు 10న ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (UTF) స్థాపించబడిన విషయాన్ని గుర్తు చేస్తూ, రాష్ట్ర విభజన అనంతరం 2014 ఏప్రిల్ 13న TSUTF ఆవిర్భవించిందని వివరించారు.
గత 12 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల హక్కుల కోసం TSUTF పోరాటం కొనసాగుతోందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న 5 డీఏలను వెంటనే ప్రకటించాలని, పీఆర్సీ అమలు చేయాలని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని కోరారు. అలాగే పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు పి. మహేష్ బాబు, ఎన్. చంద్రశేఖర్ పాల్గొనగా, కోశాధికారి వి. లక్ష్మీపతి కీలక ప్రసంగం చేశారు. మండల ఉపాధ్యక్షురాలు కె. సువర్ణ, ఎఫ్డబ్ల్యూఎఫ్ కన్వీనర్ బి. పరమేశ్వర్తో పాటు సీనియర్ నాయకులు, మండల సభ్యులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.