ముద్ర, శేరిలింగంపల్లి : భారతదేశంలో ప్రముఖ ప్రజాస్వామ్య రైతు సంస్థగా పేరొందిన భారతీయ కిసాన్ సంగతన్ (బీకేఎస్) దక్షిణ భారత కన్వీనర్గా యర్రం శ్రీరాం రెడ్డి నియామకమయ్యారు. ఈ సందర్బంగా శ్రీరామ్రెడ్డి మాట్లాడుతూ రైతుల సమగ్ర అభివృద్ధి, స్వావలంబన, ప్రభుత్వ పథకాల అమలు బలోపేతం దిశగా ఈ నియామకం కీలకంగా మారుతుందన్నారు.. దక్షిణ భారత రాష్ట్రాలలో వ్యవసాయ నూతన సాంకేతికత, రైతు సంక్షేమం, ప్రభుత్వ పథకాల లబ్ధి రైతులకు చేరేలా సమన్వయం చేయడం తన ప్రధాన లక్ష్యమని శ్రీరాం రెడ్డి తెలిపారు. పంట బీమా పథకాలు సమర్థంగా అమలు చేయడం, అన్ని పంటలకు కనీస మద్దతు ధరలు (ఏంఎస్ పి) హామీ ఇవ్వడం, సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేయడం, అప్పుల బారిన పడిన రైతులకు ఉపశమనం కల్పించడం వంటి అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు దేశానికి వెన్నెముక మాత్రమే కాక జీవనాడి అని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచిన బీకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కమ్ జాతీయ కన్వీనర్ యర్రం వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పీఎం కిసాన్ సమాన్ నిధి, కిసాన్ క్రెడిట్ కార్డు వంటి ప్రభుత్వ పథకాలు గ్రామీణ ప్రాంతాల చివరి రైతు వరకు చేరేలా కృషి చేస్తానని తెలిపారు.