చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
  • లింగంగుంట్ల వద్ద ఢీకొన్న ఆర్టీసీ బస్సు - ఆటో
  • ముగ్గురు మృతి.. 13 మందికి గాయాలు
  • గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమం

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల బస్ స్టాప్ వద్ద ఆర్టీసీ బస్సు - ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. 13 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వేలూరు గ్రామానికి చెందిన 15 మంది వ్యవసాయ కూలీలు నాదెండ్ల మండలం అప్పాపురంలో మిర్చి కోత కోసం ఆటోలో వస్తున్నారు. అదే సమయంలో చిలకలూరిపేట వైపుగా మాచర్ల డిపోకు చెందిన బస్సు వెళ్తోంది. ఈ సమయంలో గణపవరం రోడ్డు నుంచి ఆటో ఒక్కసారిగా మెయిన్ రోడ్డుపైకి వచ్చింది. ఇది గమనించిన ఆర్టీసీ డ్రైవర్ తప్పించే ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యపడలేదు. బస్సు కిందపడ్డ ఆటో నుజ్జయింది. 

ఈ ప్రమాదంలో హనుమాయమ్మ (60), శివపార్వతి (58), హజరత్ వలీ (65) మృతి చెందారు. పరిస్థితి విషమంగా ఉన్న శివకుమారి (60), కోటేశ్వరమ్మ (60)లను మెరుగైన వైద్యం కోసం వివిధ ఆసుపత్రులకు తరలించారు. ఇతర క్షతగాత్రులకు చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చిలకలూరిపేట గ్రామీణ పీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.