27 నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర

27 నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర
  • ఇడుపులపాయ నుంచి వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార భేరి
  • శ్రీకారం చుట్టనున్న సీఎం వైఎస్‌ జగన్‌ 
  • సిద్ధం సభలు నిర్వహించిన నాలుగు జిల్లాల్లో మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర 
  • 21 రోజులపాటు ఇచ్ఛాపురం వరకు కొనసాగింపు.. ప్రతి రోజూ ఒక జిల్లాలో ఉదయం వివిధ వర్గాల ప్రజలతో సమావేశం 
  • ప్రభుత్వ పనితీరు మరింత మెరుగవ్వడం కోసం వారి నుంచి సలహాలు, సూచనల స్వీకరణ.. సాయంత్రం సభకు ఆ పార్లమెంట్‌ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి తరలిరానున్న పార్టీ శ్రేణులు 
  • బస్సు యాత్ర పూర్తయ్యే వరకు ప్రజా క్షేత్రంలోనే ముఖ్యమంత్రి
  • ఇప్పటికే నాలుగు సిద్ధం సభలు సూపర్‌ హిట్‌ 
  • 175 శాసనసభ, 24 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఖరారు  
  • 58 నెలల్లో చేసిన మంచిని వివరించనున్న వైఎస్‌ జగన్‌ 
  • 2014లో ఇచ్చిన హామీలు అమలు చేయని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి.. ఇప్పుడు అదే కూటమి మళ్లీ మోసం చేయడానికి వస్తోందని ప్రజలను అప్రమత్తం చేయనున్న జననేత 
  • ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యేలోగా తొలి విడత ప్రచారం పూర్తి చేసేలా ప్రణాళిక   

అమరావతి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు.. మరోసారి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుని అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 27న వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రచార భేరి మోగించనున్నారు. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద నివాళులు అర్పించి.. ఎన్నికల సంగ్రామానికి ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు దాదాపు 21 రోజులపాటు బస్సు యాత్ర కొనసాగనుంది.

పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి సిద్ధం సభలు నిర్వహించిన నాలుగు జిల్లాలు (విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం, బాపట్ల) మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర జరగనుంది. ప్రతి రోజూ ఒక పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో ఉదయం పూట వివిధ వర్గాలు, రంగాల ప్రజలతో సీఎం జగన్‌ సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగు పర్చుకోవడానికి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. కొందరు పార్టీ కార్యకర్తలను, అభిమానులను కూడా కలుస్తారు. సాయంత్రం పార్లమెంట్‌ నియోజకవర్గంలో బహిరంగ సభ ఉంటుంది.

ఆ పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఈ సభకు తరలి రానున్నారు. బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు సీఎం జగన్‌ పూర్తిగా ప్రజలతో మమేకం కానున్నారు. యాత్రలోనే ఎక్కడికక్కడ విడిది చేయనున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని చెబుతూ.. ప్రతి ఇంటికీ మేలు చేశామని వివరించనున్నారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో వ్యవసాయ రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి వంటి వాటితోపాటు 650 హామీలు ఇచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి.. వాటిని అమలు చేయకుండా మోసం చేయడాన్ని కూడా ప్రజలకు విశదీకరించి చెప్పనున్నారు. అప్పట్లో మోసం చేసిన కూటమి మరోసారి జట్టుకట్టి మళ్లీ వస్తోందంటూ ప్రజలను అప్రమత్తం చేయనున్నారు. మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మీ ఇంటికి మంచి జరిగి ఉంటే.. మీ బిడ్డకు అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేయనున్నారు.   

కదనోత్సాహంలో పార్టీ శ్రేణులు  
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసిన సీఎం జగన్‌.. గత 58 నెలల్లో డీబీటీ రూపంలో 2.70 లక్షల కోట్లు, నాన్‌ డీబీటీ రూపంలో రూ.1.79 లక్షల కోట్లు వెరసి రూ.4.49 లక్షల కోట్ల ప్రయోజనాన్ని 87 శాతం కుటుంబాలకు చేకూ­ర్చారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ ద్వారా గుమ్మం వద్దకే ప్రజలకు ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. చేసిన మంచిని ప్రతి ఇంటా వివరించి.. ఆశీర్వాదం తీసుకోవడానికి చేపట్టిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

గత 58 నెలల పాలనలో వచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రతి నియోజవకర్గం, ప్రతి గ్రామం, ప్రతి ఇంటా కనిపిస్తున్నప్పుడు 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించడం సుసాధ్యమేనని సీఎం జగన్‌.. శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలకు సముద్రంతో పోటీ పడుతూ జనం హాజరయ్యారు. రాప్తాడు, మేదరమెట్ల సభలు రాష్ట్ర చరిత్రలో అతి పెద్ద ప్రజా సభలుగా నిలిచాయి. ఎన్నికలకు ముందే వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ‘సిద్ధం’ సభల్లో కళ్లకు కట్టినట్లు కన్పించడంతో పార్టీ శ్రేణులు కదనోత్సాహంతో కదం తొక్కుతున్నాయి. 

క్లీన్‌ స్వీపే లక్ష్యంగా అడుగులు  
టీడీపీ–జనసేన–బీజేపీ శ్రేణులు నైతిక స్థైర్యం కోల్పోయి కకావికలమైతే.. వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో జోష్‌ కనిపిస్తోంది. ఈ దశలో సీఎం జగన్‌ బస్సు యాత్ర వారిలో మరింత ఉత్సాహాన్ని నింపనుంది. క్లీన్‌ స్వీప్‌ లక్ష్యంగా ముఖ్యమంత్రి అడుగులు ముందుకు వేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను ‘మేం సిద్ధం.. మా బూత్‌ సిద్ధం.. ఎన్నికల సమరానికి మేమంతా సిద్ధం’ పేరుతో గ్రామ స్థాయి నుంచి మరింత పటిష్టంగా ఎన్నికలకు సన్నద్ధం చేసేలా సీఎం జగన్‌ దిశా నిర్దేశం చేస్తారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 18న విడుదల కానున్న నేపథ్యంలో, ఆలోగా తొలి దశ ప్రచారంగా బస్సు యాత్ర పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడ్డాక మలి విడత ప్రచారాన్ని చేపట్టనున్నారు.   

టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి కకావికలు  
వైఎస్సార్‌సీసీ సిద్ధం సభలు సూపర్‌ హిట్‌ కావడంతో టీడీపీ శ్రేణులు కకావికలమయ్యాయి. జననేతతో టీడీపీ పొత్తు లెక్క తేలాక, రెండు పార్టీలు ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభ జనం లేక అట్టర్‌ప్లాప్‌ కావడంతో ఆ పార్టీల శ్రేణులు నైతిక స్థైర్యం కోల్పోయాయి. ఈ క్రమంలోనే ఒకే రోజు 175 శాసనసభ, 24 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం వైఎస్‌ జగన్‌.. అందులో వంద స్థానాలు అంటే 50 శాతం స్థానాలను బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాలకు ఇవ్వడంతో ఆ వర్గాల్లో హర్షాతిరేకాలు మిన్నంటాయి.

శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఇంటింటా ప్రచారం చేస్తూ ప్రజా క్షేత్రంలో దూసుకెళ్తున్నారు. మరో వైపు నైతిక స్థైర్యం కోల్పోయిన శ్రేణుల్లో ధైర్యాన్ని నింపేందుకు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల కాళ్లావేళ్లా పడి ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నాక.. మూడు పార్టీలు కలిసి చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రధాని మోదీ పాల్గొన్నప్పటికీ జనం మొహం చాటేయడంతో అట్టర్‌ ప్లాప్‌ అయ్యింది. దాంతో మూడు పార్టీల కార్యకర్తలే కాదు నేతలూ పూర్తిగా డీలాపడ్డారు.