విశాఖను వైసీపీ ప్రభుత్వం గంజాయిమయం చేసింది

విశాఖను వైసీపీ ప్రభుత్వం గంజాయిమయం చేసింది

ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు
విశాఖపట్నం : ప్రశాంతమైన విశాఖపట్నం నగరాన్ని వైసీపీ ప్రభుత్వం వచ్చాక గంజాయిమయం చేశారని శంఖారవం సభలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆరోపించారు. విశాఖ నగరంలో వైసీపీ నేతలు యథేచ్చగా భూకబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. విశాఖలో రూ.45వేల కోట్ల విలువైన భూములను వైసీపీ పెద్దలు ఆక్రమించారని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఇక్కడ అందించిన సేవలు అనిర్వచనీయమని కొనియాడారు. అందువల్లే గత ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీగెలిచినా విశాఖలో మాత్రం నాలుగు స్థానాల్లోనూ టీడీపీ విజయం సాధించిందని గుర్తు చేశారు. రాబోయేది టీడీపీ-జనసేన ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుని ఆక్రమించుకున్న భూములను స్వాధీనం చేసుకుంటామని అన్నారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని వైసీపీ కార్యాలయంగా మార్చేశారని రామకృష్ణ మండిపడ్డారు. విశాఖ రూరల్‌లోని ఒక గ్రామాన్నే విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో మింగేశారని ఆరోపించారు. నగరపరిధిలో వెయ్యికోట్ల టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగిందని చెప్పారు. సింహాచలం భూములకు సంబంధించి 229 జీఓను మన ప్రభుత్వం వచ్చాక అమలుచేయాలని అన్నారు. కనీసం మినీస్టేడియం కూడా కట్టలేని స్థితిలో వైసీపీ అసమర్థ పాలకులు ఉన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ప్రభుత్వం వచ్చాక విశాఖపట్నాన్ని మళ్లీ అభివృద్ధి పట్టాలు ఎక్కించాలని కోరుకుంటున్నట్టు వెలగపూడి రామకృష్ణ చెప్పారు.