మంత్రి రజిని, ఎంపీ అవినాష్‌ బంధువులకు హైకోర్టు నోటీసులు

మంత్రి రజిని, ఎంపీ అవినాష్‌ బంధువులకు హైకోర్టు నోటీసులు

గ్రానైట్‌ తవ్వకాలపై హైకోర్టు స్టేటస్‌ కో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో మంత్రి విడదల రజిని, ఎంపీ అవినాష్‌రెడ్డి బంధువులు ప్రతాప్‌రెడ్డి, శ్వేతారెడ్డి, జి.వి.దినేశ్‌రెడ్డి, శివపార్వతికి నోటీసులు పంపింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడిలో 21.50 ఎకరాల స్థలంలో తమకు తెలియకుండా గ్రానైట్‌ తవ్వకాలకు ఎన్‌వోసి ఇవ్వడంపై హైకోర్టులో రైతుల పిటిషన్‌ దాఖలు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన భూముల్లో డి.కె. పట్టాలు రద్దు చేయకుండా తవ్వకాలు జరిపారని పేర్కొన్నారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది వి.వి.లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు.  వాదనలు విన్న న్యాయస్థానం... గ్రానైట్‌ తవ్వకాలపై స్టేటస్‌ కో విధించింది. ఎన్‌వోసీ ఇచ్చిన తహసీల్దార్‌తో సహా పలువురికి నోటీసులు పంపింది. దీనిపై తదుపరి విచారణను వచ్చేనెల 10కి వాయిదా వేసింది. అప్పటివరకూ స్టేటస్‌ కో ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. అదేవిధంగా దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని మంత్రి రజిని, ఇతరులను హైకోర్టు ఆదేశించింది.