విశాఖను వాషింగ్టన్​ డీసీ చేస్తా

విశాఖను వాషింగ్టన్​ డీసీ చేస్తా
  • నేను సీఎం అయితే ఏపీ అప్పు మొత్తం తీర్చేస్తా
  • ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్​

ముద్ర, ఏపీ : ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తమదే విజయమని, అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖను రాజధానిగా చేస్తామని, అభివృద్ధిలో వాషింగ్టన్​ డీసీగా నిలుపుతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్​ అన్నారు. లోక్‌సభ ఎన్నికలలో విశాఖపట్నం పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగిన  కేఏ పాల్ శుక్రవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం కావడం కొంత మందికి ఇష్టం లేదన్నారు. ‘నేను సీఎం అయితే 13 రూ.లక్షల కోట్ల అప్పు తీరిపోతుంది. ప్రజలను బానిసలుగా ఉంచాలని పాలకులు చూస్తున్నారు. 7 ప్రధాన అంశాలతో ఎన్నికల్లోకి వెళ్తాం. మంచి పాలన కోసం ప్రజాశాంతి పార్టీకి పట్టం కట్టండి.

అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి విశాఖను రాజధానిగా చేస్తాం. ఐదేళ్లలో విశాఖను వాషింగ్టన్ డీసీకి ధీటుగా అభివృద్ధి చేసి చూపిస్తా. విశాఖకు లక్ష కోట్లు ఆదాయం తెస్తా. విశాఖ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ చేస్తా’’ అని కేఏ పాల్ అన్నారు. తన పోరాటం కారణంగానే ఏప్రిల్‌లో జరగాల్సిన ఎన్నికలు మే నెలలో జరగబోతున్నాయని కేఏ పాల్ అన్నారు. ఉత్తరాంధ్రలో ఏటా 2 లక్షల ఉద్యోగాలు వచ్చేలా చేస్తానన్నారు. విశాఖను డ్రగ్, మాదక ద్రవ్యాల రహిత నగరంగా మార్చివేస్తానని కేఏ పాల్ వాగ్దానం చేశారు. స్టీల్ ప్లాంట్ కోర్ కమిటీలో కొందరు అమ్ముడు పోయారని ఆరోపించిన ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుతామని చెప్పారు. ఎన్నికలకు సంబంధం లేకుండా విశాఖ ఉక్కును కాపాడడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా పాల్ పేర్కొన్నారు. ప్రజాశాంతి ఆఫీసులో ప్రెస్‌మీట్ పెట్టకూడదని చెప్పడం ఎంటి? అని పాల్ ప్రశ్నించారు. అధికారుల ప్రవర్తన చట్టానికి విరుద్ధంగా ఉందన్నారు. ఇక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా 8 సార్లు ఆర్డర్లు తెచ్చానని అన్నారు. తాను 10వ తరగతి ఫెయిల్ అయ్యానని, డిగ్రీ మధ్యలో ఆపేశానని, తనపై ఒక్క అవినీతి కేసు కూడా లేదని అన్నారు.