షర్మిల, సునీతలకు కడప కోర్టు బిగ్ షాక్

షర్మిల, సునీతలకు కడప కోర్టు బిగ్ షాక్

ముద్ర, సెంట్రల్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెల్లెళ్లు సునీత, షర్మిలలకు కడప జిల్లా కోర్టు మరో సారి షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కూడా వివేకానంద రెడ్డి హత్య కేసు విషయమై మాట్లాడొద్దని కడప కోర్టు గతంలో తీర్పు నిచ్చిన విషయం విదితమే. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ ఇటీవల వివేకానంద రెడ్డి కుమార్తె సునీత హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆమె పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఈ కేసు విషయాన్ని కడప కోర్టులోనే తేల్చుకోవాలంటూ ఆదేశించింది. అలాగే వైఎస్ సునీత కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు గతంలో ఇచ్చిన తీర్పుపై కడప కోర్టు విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు చివరికి వారు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. అలాగే తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ సునీత, షర్మిలకు రూ. 10 వేలు జరిమానాను కూడా కడప కోర్టు విధించింది. ఈ జరిమానా మొత్తాన్ని కడప లీగల్ సెల్ కు కట్టాలంటూ కోర్టు ఆదేశించింది.