కొంప ముంచిన రాబిన్ శర్మ ఐడియా.. ఇరుకు రోడ్డులో చంద్రబాబు సభ..
గతంలో ఎన్నడూ జరగని ఘటన కందుకూరు దుర్ఘటన. రాజకీయ పార్టీల అగ్రనేతల సభలకు వచ్చి వెళుతూనో, వస్తూనో రోడ్డు ప్రమాదానికి గురయిన ఘటనలు చూశాం. కానీ తొక్కిసలాట జరిగిన ఘటన మాత్రం ఇదే. గతంలో ఎన్నడూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఇలాంటి చోట్ల సభలు పెట్టలేదు. రోడ్ షోలు నిర్వహించినా సరైన స్థలంలో ఆయన నిర్వహించేలా చర్యలు తీసుకునేవారు. అందుకే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. జగన్, పవన్ కల్యాణ్ వంటి నేతల సభల్లోనూ ఇలాంటి తొక్కిసలాట జరగలేదు. కందుకూరులో నిన్న జరిగిన ఘటన దురదృష్టకరమే. దానిని ఎవరూ కాదనలేరు. కేవలం డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి జనం ఎక్కువగా వచ్చారని చూపించడమే అసలు లక్ష్యం. దాని కారణంగానే ఇరుకు రోడ్లలో రోడ్ షోలను పెట్టడం ఇటీవల అందరికీ అలవాటుగా మారింది. ఇది రాబిన్ శర్మ ఐడియానే అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి రాబిన్ శర్మ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో అనేక ప్రోగ్రాంలు రూపుదిద్దుకుంటున్నాయి. మహానాడు తర్వాత మినీ మహానాడులకు ప్లాన్ చేశారు. అది మైదానంలో జరగడంతో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు. అనంతరం బాదుడే బాదుడు కార్యక్రమం పెట్టారు. ఇది కూడా కొంత ఇరుకు సందుల్లోనే పెట్టారు.. టీవీల్లో ఎక్కువమంది జనం కన్పించడానికి ఈ రకమైన ప్లాన్ వ్యూహకర్త రాబిన్ శర్మ చేశారన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. అదే ఇప్పుడు పార్టీకి అప్రదిష్ట తెచ్చి పెట్టింది. ఇదేం ఖర్మ రాష్ట్రానికి అని రాబిన్ శర్మ టీం ప్లాన్ చేసింది.
చంద్రబాబు కూడా ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో మూడు రోజుల పాటు పర్యటనలను రాబిన్ శర్మ ప్లాన్ చేశారు. అలా వెళ్లిన సందర్భంలో మొదటి రోజునే కందుకూరులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వ్యూహకర్త కేవలం ప్రోగ్రాం డిజైన్లు చేయడమే కాదు.. అందుకు అనుగుణమైన కార్యక్రమాలను దగ్గరుండే టీంను కూడా ఆయన పర్యవేక్షించాల్సి ఉంటుంది. పార్టీ అధినేత టూర్ ప్రోగ్రాంలకు ముందస్తు చర్యలు తీసుకునేందుకు ఒక విభాగాన్ని రూపొందించుకోవాలి. ప్రోగ్రామ్ కో`ఆర్డినేటర్ గా ఒకరిని నియమించుకోవాల్సి ఉంది. అలాంటివేవిూ చేయకుండా కేవలం లోకల్ పార్టీ నేతలపైనే వదిలేస్తే ఇలాగే జరుగుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. టిక్కెట్ల కోసం పోటీ పడే నేతలు అలాంటి చోట్లనే సభలను ఏర్పాటు చేస్తారు. చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి నేతల మధ్య పోటీ ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా పార్టీ అధినేత టూర్లను చూసుకోవడానికి కో`ఆర్డినేటర్ ను నియమించుకోవాలని, సభల నిర్వహణలకు మార్గదర్శకాలను రూపొందించుకోవాలన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
చంద్రబాబును ఆకట్టుకోవడానికి నేతలు చేస్తున్న ప్రయత్నాలు మరణాలకు దారి తీస్తున్నాయి. జనసవిూకరణ చేయలేక చంద్రబాబు దృష్టిలో పడటానికి చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు కారణమని చెప్పక తప్పదు. ఇరుకు సందుల్లో సభను ఏర్పాటు చేయడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నేతలు పోటా పోటీగా జనసవిూకరణ చేయాలని కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి కూడా ఆదేశాలు అందడంతో పల్లెటూళ్ల నుంచి కార్యకర్తలను తరలిస్తున్నారు. కందుకూరులో చంద్రబాబు రోడ్ షోలో జరిగిన ప్రమాదంలో ఎనిమిదిమంది మరణించడం సంచలనం కలిగించింది. ఇది పూర్తిగా నిర్వాహకుల నిర్లక్ష్యంగానే చూడాలి. కందుకూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ రోడ్డు అరవై అడుగులు కూడా లేదు. ఆ అరవై అడుగుల రోడ్డును దుకాణాదారులు కొంత ఆక్రమించారు. రోడ్డుకు అటువైపు, ఇటువైపు డ్రైనేజీ గుంతలు ఉన్నాయి. దీనికితోడు ఇరువైపులా చంద్రబాబుకు స్వాగతం చెబుతూ ఫ్లెక్సీలు కట్టారు. మరోవైపు ద్విచక్ర వాహనాలను నిలిపారు. దీంతో ఎన్టీఆర్ సర్కిల్ రోడ్డు ముప్ఫయి ఐదు అడుగులకు మించిలేదని చెబుతున్నారు. కందుకూరు టీడీపీ టిక్కెట్ ను ఆశిస్తున్న ఇంటూరు రాజేష్, ఇంటూరు నాగేశ్వరరావు పోటా పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, సభకు వచ్చిన వారి ద్విచక్ర వాహనాలు కూడా రోడ్డు పక్కనే పార్క్ చేయడంతో రోడ్డు కుంచించుకుపోయింది. నాలుగువేలమంది పట్టే రోడ్డులోకి ఎక్కువమంది జనం రావడంతో ఈ ఘటన జరిగింది. దీంతో పాటు టిక్కెట్ ఆశిస్తున్న ఇరువురి నేతలకు చెందిన కార్యకర్తలు పోటా పాటీ నినాదాలు చేసుకుంటూ ముందుకు రావడంతోనే తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు.