మహాశివరాత్రి జాతరకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలి

మహాశివరాత్రి జాతరకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలి
  • మార్చి 7 నుంచి 9 వరకు 3 రోజుల పాటు మహాశివరాత్రి జాతర 
  • తాత్కాలిక పార్కింగ్ లాట్స్ లను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలి
  • ప్రతి 100 మీటర్లకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలి
  • శివ భక్తుల కోసం సహాయ కేంద్రాలు ఏర్పాటు
  • కలెక్టర్ అనురాగ్ జయంతి


ముద్ర ,సిరిసిల్ల: దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ   రాజన్న మహా శివరాత్రి జాతర నిర్వహణకు విస్తృతంగా ఏర్పాటు చేయాలని, ప్రణాళిక ప్రకారం నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం వేములవాడలో మహాశివరాత్రి జాతర సందర్బంగా  చేయాల్సిన ఏర్పాట్లను కలెక్టర్ అనురాగ్ జయంతి  ఎస్పీ అఖీల్ మహజన్ తో కలిసి పరిశీలించారు. మార్చి 7 నుంచి మార్చి 9 వరకు 3 రోజుల పాటు మహా శివరాత్రి జాతర నుఅత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు  చేయాలని, నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి సన్నద్ధమయ్యే విధంగా వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ  మహాశివరాత్రి జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు ఆయా శాఖలకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించాలని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇబ్బందులు కలుగకుండ అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు.3 షిఫ్టులలో పారిశుధ్య కార్మికులను నియమించి ఆలయ ప్రాంగణం, జాతర పరిసరాలను నిరంతరాయంగా శుభ్రం చేస్తూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని,  పారిశుద్ధ్య కార్మికుల అటెండెన్స్ రెగ్యులర్ గా మానిటర్ చేసేందుకు సెక్టార్ వారీగా సంబంధిత అధికారులను నియమించాలని, మున్సిపల్, టెంపుల్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శుల ద్వారా పారిశుధ్య కార్యక్రమాలు పర్యవేక్షించాలని అన్నారు.త్రాగునీరు మూత్రశాలలకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. జాతర సందర్భంగా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని వైద్యాధికారులు పారామెడికల్ సిబ్బంది అవసరమైన మందులతో అందుబాటులో ఉంచాలని అన్నారు.

భక్తులకు అసౌకర్యం కలగకుండా అవసరమైన మేర టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, దేవస్థానం క్యూలైన్లు పరిసర ప్రాంతాలు రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేయాలని, మిషన్ భగీరథ ద్వారా భక్తులకు త్రాగునీటి   వసతి కల్పించాలని, ప్రతి 100 మీటర్లకు త్రాగునీటి ట్యాపులను ఏర్పాటు చేయాలని అన్నారు.మహాశివరాత్రి జాతర సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత వ్యవస్థ ఏర్పాటు చేయాలని, జాతర ప్రాంగణ మొత్తం సీసీ కెమెరాలు ఆధీనంలో ఉండేలా చూడాలని, సీసీ కెమెరాలు పూర్తిస్థాయిలో పనిచేయాలని, అన్ని శాఖల అధికారులు సిబ్బంది సహాయ సహకారంతో విధులు నిర్వహించాలని, భక్తులకు ఇబ్బందులు కలకుండా అవసరమైన మేర ఫ్లెక్సీ లు, సైన్ బోర్డులు, ఎంట్రీ, ఎక్సిట్ బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహజాన్ మాట్లాడుతూ.. ఈ సారి భక్తుల రద్దీ పెరిగే నేపథ్యంలో అవసరమైన మేర తాత్కాలిక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని, క్యూలైన్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు, ఇబ్బందులు కలుగకుండ ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, పోలీస్ బందోబస్తు సిబ్బందికి అవసరమైన వసతి ఏర్పాటు చేయాలని, పార్కింగ్ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ నియంత్రణకు జెసిబి, టోయింగ్ వాహనాలను సిద్ధం చేయాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో వేములవాడ డీఎస్పీ నాగేంద్ర చారి, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి అన్సారీ, మున్సిపల్ కమీషనర్ అన్వేష్, ఆలయ ఈఈ రాజేష్, ఏఈఓ జయ కుమారి, టౌన్ సీఐ కరుణాకర్, ఆలయ సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.