సీఎం కేసీఆర్ కలిసిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు

సీఎం కేసీఆర్ కలిసిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల:రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు ( వ్యవసాయ రంగ వ్యవహారాలు) గా తనను నియమించినందుకు వేములవాడ శాసన సభ్యులు డా. చెన్నమనేని రమేశ్ బాబు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ను బుధవారం నాడు మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రమేశ్ బాబు మాట్లాడుతూ... వ్యవసాయ రంగంలో నెలకొన్న ఆరు దశాబ్దాల వ్యవసాయ సంక్షోభాన్ని , స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, కేవలం దశాబ్ధికాలం లోపే అధిగమించిందని వారు తెలిపారు. 

సిఎం కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ రాష్ట్రం నేడు వ్యవసాయ విధానాల అమలు, వ్యవసాయాభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని రమేశ్ బాబు తెలిపారు. సిఎం కేసీఆర్ సారథ్యంలో వ్యవసాయ అభివృద్ధి, రెండవ దశలో భవిష్యత్తు సవాళ్లకు సిద్దమౌతున్న సమయంలో సిఎం కేసీఆర్ తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని ఎమ్మెల్యే రమేశ్ బాబు తెలిపారు.ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ చెన్నమనేనికి శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు.