అమ్మాయిలు బంగారం 

అమ్మాయిలు బంగారం 
  • ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం 
  • టీ20లో శ్రీలంకను ఓడించిన హర్మన్​సేన
  • షూటర్స్‌ హవా.. ఖాతాలో ఐదో  పతకం

హాంగ్జౌ : ఆసియా క్రీడలు- 2023లో భారత్‌కు మరో పతకం లభించింది. మహిళల క్రికెట్‌ ఈవెంట్‌లో భాగంగా శ్రీలంకతో సోమవారం జరిగిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు 19 పరుగుల తేడాతో విజయం సాధించి సగర్వంగా కప్​అందుకుంది. హాంగ్జౌ వేదికగా జరిగిన హోరాహోరీ పోరులో భారత జట్టు 117 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్​కు దిగిన శ్రీలంక.. 8 వికెట్లు కోల్పోయి 97 పరుగులు మాత్రమే చేసింది. లంకలో హాసిని పెరీరా (25), నీలాక్షి డిసిల్వా (23) టాప్‌ స్కోరర్లు. అంతకు ముందు టీమ్‌ ఇండియాలో ఓపెనర్‌ స్మృతి మంధాన (46; 45 బంతుల్లో 4x4, 1x6), జెమామీ రోడ్రిగ్స్‌ (42; 40 బంతుల్లో 5x4) ధాటిగా ఆడారు.

మంధాన.. జెమీమా అదుర్స్‌

పాత పిచ్‌ల పైనే ఆడించడం.. అవి మరీ మందకొడిగా ఉండటంతో టీమ్‌ఇండియా మొదట బ్యాటింగ్‌కు దిగింది. అసలే వికెట్లు స్పిన్నర్లకు అనుకూలిస్తుండటంతో తెలివిగా బ్యాటింగ్‌ చేసింది. జట్టు స్కోరు 16 వద్దే ఓపెనర్ షెఫాలీ వర్మ (9) స్టంపౌట్‌ అయింది. దాంతో వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్‌తో కలిసి స్మృతి మంధాన జట్టుకు మంచి స్కోరు అందించింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 67 బంతుల్లో 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనవసర షాట్లు ఆడలేదు. అందివచ్చిన బంతుల్నే బౌండరీకి పంపించారు. అయితే హాఫ్‌ సెంచరీకి చేరువైన స్మృతిని జట్టు స్కోరు 89 వద్ద రణవీర ఔట్‌ చేసింది. మరికాసేపటికే జెమీమా అద్భుత ఇన్నింగ్స్‌కు ప్రబోధిని తెరదించింది. ఆ తర్వాత ఎవరూ రెండంకెల స్కోరు చేయకపోవడంతో టీమ్‌ఇండియా 116/7కు పరిమితమైంది.

ఆఖరి వరకు థ్రిల్లింగ్‌

ఛేదనకు దిగిన శ్రీలంకకు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 13 వద్దే ఓపెనర్‌ అనుష్క సంజీవని (1), వన్‌డౌన్లో వచ్చిన విష్మీ గుణరత్నె (0)ను టిటాస్‌ సాధు ఔట్‌ చేసింది. దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన చమరీ ఆటపట్టు (12)నూ ఆమె క్లీన్‌బౌల్డ్‌ చేసింది. 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన శ్రీలంకకు హాసినీ పెరీరా, నీలాక్షి ప్రాణం పోశారు. నాలుగో వికెట్‌కు 33 బంతుల్లో 36 పరుగుల భాగస్వామ్యం అందించారు. పదో ఓవర్‌ ఆఖరి బంతికి హాసినిని గైక్వాడ్‌ ఔట్‌ చేసినా.. ఓషది రణసింఘెతో కలిసి నీలాక్షి 28 (38) పరుగుల భాగస్వామ్యం అందించింది. ఆఖర్లో టెయిలెండర్లు దూకుడుగా ఆడబోయి వికెట్లు ఇవ్వడంతో టీమ్‌ఇండియా గెలిచేసింది.

షూటర్స్‌ హవా.. షూటర్ల ఖాతాలో ఐదో పతకం

ఆసియా గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల షూటింగ్‌ విభాగంలో ఐదో పతకం దక్కింది. మెన్స్‌ 25 మీటర్ల రాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఆదర్శ్‌ సింగ్‌ టీమ్‌ కాంస్యం నెగ్గింది. విజయ్‌వీర్‌ సిధు, అనిష్‌ భన్వాలా, ఆదర్శ్‌ సింగ్‌లతో కూడిన జట్టు 1718 స్కోర్‌తో మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకుంది. 1,765 స్కోర్‌తో చైనా గోల్డ్‌ మెడల్‌ గెలువగా, 1734 స్కోర్‌తో కొరియా సిల్వర్‌ దక్కించుకుంది. అంతకుముందు పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో ఐశ్వరి ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌కు కాంస్యం సాధించాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో రుద్రాంక్ష్‌ పాటిల్‌, దివ్యాన్ష్‌ సింగ్‌ పన్వర్‌, ఐశ్వరి తోమర్‌లతో కూడిన టీమ్ బంగారు పతకం గెలిచింది.  మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో రమిత, మొహులీ ఘోష్‌, ఆషి చౌక్సీతో కూడిన జట్టు రజత పతకం నెగ్గింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో రమిత జిందాల్‌ కాంస్య పతకం గెలుచుకుంది. దాంతో ఇప్పటివరకు షూటింగ్‌లో భారత్‌ నెగ్గిన పతకాల సంఖ్య ఐదుకు పెరిగింది. మొత్తం పతకాల సంఖ్య 10కి చేరింది.