సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన సీపీ
ముద్ర ప్రతినిధి, జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శనివారం పరిశీలించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జనగామ జిల్లా కేంద్రంలో అధికార బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ బహిరంగ సభకు గులాబీ బాస్, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. కాగా, బహిరంగ సభ ప్రాంగణంతో పాటు హెలిప్యాడ్ ప్రాంతాన్ని సీపీ అధికారులతో కలిసి పరిశీలించారు. బారీకేడ్ల ఏర్పాటు, సభ వేదిక, రూట్ మ్యాప్ను చెక్ చేశారు. సభకు ప్రజలు వచ్చే మార్గాలు, వీఐపీ రూట్ల ఏర్పాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీసులు బందోబస్తు అంశాలపై పోలీస్ కమిషనర్ అధికారులకు పలు సూచనలు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయానికి వచ్చిన పోలీస్ కమిషనర్ కు డీసీపీ సీతారాం, ఏసీపీ దేవేందర్ రెడ్డి, సీఐ శ్రీనివాస్ పుష్ప గుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన వారిలో క్రైం డీసీపీ దాసరి మురళీధర్, అదనపు డీసీపీ సంజీవ్, ఏసీపీలు జితేందర్ రెడ్డి, రమేష్ కుమార్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.