మంథని లో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు..

మంథని లో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు..
  • నేను రాజకీయ నాయకున్ని తప్పకుండా రాజకీయం చేస్తా...
  • తాను మర్డర్లు చేయడానికో ఇతరులను కొట్టడానికో నా శక్తిని ఉపయోగించలేదు
  • మంథని లో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.

 
ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి:  నేను రాజకీయ నాయకున్ని తప్పకుండా రాజకీయం చేస్తానని, తాను మర్డర్లు చేయడానికో ఇతరులను కొట్టడానికో నా శక్తిని ఉపయోగించలేదని మంథని లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం రాత్రి మంథని బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మంథని పట్టణంలో ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవ సంఘం, పట్టణ బ్రాహ్మణ బంధువులు మంత్రి శ్రీధర్ బాబు ను ఘనంగా సన్మానించారు. అనంతరం దుద్దిళ్ల శ్రీధర్ బాబు  మాట్లాడుతూ...నేను ఒక రాజకీయ నాయకుడిని, రాజకీయాల్లో ఉన్నానని, మంచి పనుల కోసం తప్పకుండా రాజకీయం చేస్తానన్నారు. 

తన తండ్రి మృతి చెందిన నాటి నుంచి నేటి వరకు 25 సంవత్సరాల కాలంగా మాకు మా కుటుంబానికి అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నాపై, నా కుటుంబం పై ఎన్ని రకాల దూషణలు చేసిన ప్రజాసేవలో అలాంటివి పడాల్సి వస్తుందని వాపోయారు. తాను మర్డర్లు చేయడానికో ఇతరులను కొట్టడానికో నా శక్తిని ఉపయోగించలేదని తెలిపారు. నాకు ఓటు వెయ్యని వారు  భయపడాల్సిన అవసరం లేదని సూచించారు. నేను ఒక టీచర్ ను కాదు, ఫిలాసఫర్ ను కాదు, రాజకీయ నాయకున్ని తప్పకుండా రాజకీయాలు చేస్తా అని తెలిపారు. 

గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో తనతో పాటు కార్యకర్తలను అనేక ఇబ్బందులకు గురిచేసిందని తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని, ప్రతి ఒక్కరం చట్టం పరిధిలో ముందుకు పోవాలని సూచించారు. మంథని నియోజకవర్గ నుంచి ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందానని, నేటికీ మా తండ్రి అడుగుజాడల్లో నడవలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలకు మా తండ్రి ప్రేమ, వాత్సల్యాన్ని పంచారని, అలా మా తండ్రి అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు. పది సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం తనతో పాటు తన కార్యకర్తలపై అనేక కేసులను పెట్టిందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని ఎద్దేవా చేశారని, కానీ ఈ రాష్ట్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని కాంగ్రెస్ పార్టీని ఆదరించారని అన్నారు. ఈ ప్రాంతం మంథని ముద్దుబిడ్డగా మంత్రి పదవిని చేపట్టానని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని, కాంగ్రెస్ పార్టీలో తనకు మంత్రి పదవి దక్కిందని తెలిపారు.

నేను చెప్పే మనిషిని కాదని, పనులను చేసి చూపించే మనిషినని ఆయన అన్నారు. తాను చిన్నప్పటి నుంచి అధికారంను చూస్తున్నానని, మంథని ప్రజల ఆశీర్వాదం తో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశంతో రాష్ట్రంలో మంచి నాయకునిగా ఉంటూ ప్రజాసేవలో తరిస్తానని అన్నారు. ఎల్లప్పుడూ మీ ఆశీర్వాదం ఉండాలని రాజకీయంగా నాపై ఎంతో మంది బురద చల్లుతారని, దాని ఎదుర్కోవడం  నా బాధ్యత అని అన్నారు. మంథని నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్లడం కోసం తన వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. అతి క్లిష్టంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్లడానికి నాతో పాటు సహచర మంత్రులంతా కలిసి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. నీటి కోసం అనేక ప్రయత్నాలను చేస్తున్నాం. శ్రీ పాద ఎల్లంపల్లి నుంచి మంత్రి ముత్తారంకు రెండు టీఎంసీల నీటిని, రాబోయే కాలంలో పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటు చేసుకుంటే, మంథని పెద్దపల్లి ప్రాంతానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఐదు సంవత్సరాల కాలంలో పత్తిపాక రిజర్వాయర్ ను భగవంతుని ఆశీస్సులతో కడతామని తెలిపారు.

నేను ప్రభుత్వంలో ఉన్నాను, ఎవరికైనా చెడు చేయాలంటే నిమిషం పట్టదు, అది నా ధర్మం కాదని తెలిపారు. చిన్ననాటి నుంచి అధికారంలోనే ఉన్నాం. కొంతమందికి జీవితాంతం అధికారం ఉంటుందని ఆలోచనలు చేస్తారు. అధికారం ఉంటే పదిమందికి మేలు చేయాలని సూచించారు. అధికారం అందరికీ రాదు కొంతమందికి లభిస్తుంది. మంథని సరస్వతి కేంద్రం. ఈ ప్రాంత ముద్దుబిడ్డగా మంచి పేరు తీసుకువచ్చే విధంగా కృషి చేస్తానని, మంథని ప్రజల ఆశీర్వాదముతో ఈ రాష్ట్రానికి రూ. 40 వేల కోట్ల పెట్టుబడులను తీసుక రాగలిగామన్నారు. చట్టాన్ని నమ్ముకుని చట్టం పరిధిలో తప్పకుండా రాజకీయం చేస్తానని శ్రీధర్ బాబు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రిని బ్రాహ్మణ సంఘం నాయకులు, కాంగ్రెస్ ప్రజాప్రతిని పాల్గొన్నారు.