Minister Ponnam Prabhakar - కరీంనగర్ లో దీక్షకు పూనుకోనున్న మంత్రి పొన్నం ప్రభాకర్

Minister Ponnam Prabhakar - కరీంనగర్ లో దీక్షకు పూనుకోనున్న మంత్రి పొన్నం ప్రభాకర్

ముద్ర,తెలంగాణ:- గత పదేళ్లలో బీఆర్ఎస్, బీజేపీలు తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదని, ఆయా పార్టీల వైఫల్యాలపై ఈనెల 14న దీక్ష చేయనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో తాను దీక్షకు దిగనున్నట్టు ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎవరికి ఇచ్చారో వారినే ఓట్లడగాలని బీఆర్ఎస్ కు సూచించారు. మా వైపు ఒక్క వేలు చూపిస్తే, మేం నాలుగు వేళ్లు చూపెడతామంటూ అన్నారు.

పదేళ్లు మంత్రిగా ఉన్న హరీష్ రావు అసలు బుద్ధి వుండే మాట్లాడుతున్నాడా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటునే ప్రధాని నరేంద్ర మోదీ అవహేళన చేస్తూ, తెలంగాణ అమరవీరులను అవమానించారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజానీకానికి ఓట్లడిగే నైతిక హక్కు కూడా బీజేపీకి లేదని అన్నారు. రాముడి పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని అన్నారు. సికింద్రాబాద్ కు తెలంగాణ బీజేపీ అధినేత ఏమీ చేయలేదని పేర్కొన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో ఉత్తర భారతదేశంలో బాధితులను ఆదుకున్న మాదిరిగానే దక్షిణ భారతంలో కూడా ఆదుకోవాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. కేవలం అధినాయకత్వం వద్ద గుర్తింపునకే కొందరు బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర మంత్రులపై ఆరోపణలు గుప్పిస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.