కెసిఆర్ ను బి ఆర్ ఎస్ త్రయం ఏమి చేయలేదు

కెసిఆర్ ను బి ఆర్ ఎస్ త్రయం ఏమి చేయలేదు
  • తెలంగాణ భవిష్యత్తు బిఆర్ఎస్ తోనే
  • కార్యకర్తలను పార్టీ కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది
  • మంత్రి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ చేస్తున్న అభివృద్ధితో తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతున్నదని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అభివృద్ధిని ఓర్వలేని బి.ఆర్.ఎస్ త్రయం బండి సంజయ్, రేవంత్ రెడ్డి, షర్మిల అసత్య ఆరోపణలతో ప్రజలను పక్కదారు పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నగునూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కరీంనగర్ రూరల్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మంత్రి  ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నా బలమే కార్యకర్తలు  ఏ ఒక్క కార్యకర్తకు బాధ కలిగినా నాకు కలిగినట్టేనని అన్నారు నా చివరి రక్తం బొట్టు వరకు కార్యకర్తల ముఖంలో చిరునవ్వు కోసం పని చేస్తానని అన్నారు. మనమందరం కెసిఆర్ బలగమని ఐకమత్యంగా ఉండి బిఆర్ఎస్ పార్టీని బలపేతం చేసుకుందామన్నారు. ఎంతో మంది సిఎం, పిఎంలు వచ్చారు పోయారే తప్ప మనకోసం చేసిందేమి లేదన్నారు.

తెలంగాణ కంటే ముందు మన పరిస్థితులు ఎలా ఉండేవో ఆలోచించుకోవాలన్నారు. సమైక్య పాలనలో కరెంట్ ఎప్పుడు వస్తుందో పోతుందో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. తాగునీటి కోసం ట్యాంకర్ల వద్ద యుద్దాలు చేసిన రోజులు చూసామని వెల్లడించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కరెంట్, తాగునీటి ఇబ్బందిలేకుండా చేశామని తెలిపారు. సమైక్య పాలనలో 75 సంవత్సరాలుగా పేరుకుపోయిన దరిద్ర్యాన్ని తొలగిస్తున్నామని అన్నారు. తెలంగాణ లో ముఖ్యమంత్రి గా కెసిఆర్ ఉన్నారు కాబట్టే మన వనరులను మనం సంరక్షించుకొని వాడుకునే పరిస్థితి ఉందని అన్నారు. పచ్చని తెలంగాణను చూసి విపక్షాలకు, కడుపు మంట, కళ్ళ మంట ప్రారంభం అయిందని, మన వనరులను కొల్లగొట్టాలని, రాజ్యాధికారం కావాలని మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవలని చూస్తున్నారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అధిష్టానం ఢిల్లీలో ఉందని అక్కడి  నుండి కంట్రోల్ చేస్తూ ఇక్కడి వనరులను దోచుకోవడానికి చూస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణను కాపాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని మన పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది బిఆర్ఎస్ పార్టీ అని అన్నారు.

రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు కేవలం బిఆర్ఎస్ పార్టీకే ఉందని చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ఇదే విషయం చెప్తారని అన్నారు. మనమంతా ఒక కుటుంబమని కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు సహజమని వాటిని అంతర్గతంగా పరిష్కరించుకుందామని తెలిపారు . దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారని ఆయన చేతులకు మనమంతా బలం కావాలని అన్నారు. కార్యకర్తలు పార్టీని కాపాడితే పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటుందని క్రమశిక్షణ కలిగిన పార్టీ బిఆర్ఎస్ అని అన్నారు క్రమశిక్షణతో నిబద్ధత కలిగిన కార్యకర్తలుగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు సుడా చైర్మన్ జివి రామకృష్ణారావు గ్రంథాలయ కమిటీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ జడ్పిటిసిలు ఎంపీపీలు సర్పంచులు ఎంపిటిసిలు ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.