విద్యార్థుల చదువుతో రాజకీయాలు వద్దు
![విద్యార్థుల చదువుతో రాజకీయాలు వద్దు](https://mudranews.in/uploads/images/2024/06/image_750x_667d467bacb25.jpg)
- 60లక్షల బిల్లు చేసుకొని సొంతంగా కట్టించానని మాజీ ఎమ్మెల్యే ప్రచారం : ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
విద్యార్థుల చదువులో రాజకీయాలు చేయకూడదని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి అన్నారు. తాడూరు మండలంలోని కుమ్మెర, సిర్సవాడ గ్రామాల్లో నిర్మించిన పాఠశాలలను బుధవారం ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం పాఠశాలల్లో కొత్త సంస్కరణలు తీసుకొస్తుందన్నారు. వచ్చే డీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న ఉపాధి పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు.
విద్యార్థులకు కులమతాలకు అతీతంగా చదువులు సాగేలా సీఎం రేవంత్ రెడ్డి సంస్కరణలు తీసుకొస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు విద్యాశాఖను కూడా సీఎం స్వయంగా పర్యవేక్షిస్తున్నారని వివరించారు. సిర్సవాడ జడ్పీ హైస్కూల్ ప్రభుత్వ నిధుల ద్వారా వెచ్చించి నిర్మించడం జరిగిందన్నారు. మాజీ ఎమ్మెల్యే ఈ స్కూల్ కాంపౌండ్ గోడ నిర్మాణానికి 60 లక్షలు బిల్లు చేయించుకున్నారనీ ఆరోపించారు. ప్రభుత్వ బిల్లులు చేయించుకొని సొంతంగా ట్రస్ట్ ద్వారా నిర్మించానని ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు..