విద్యుత్ కొనుగోళ్లపై హైకోర్టుకు కేసీఆర్...

విద్యుత్ కొనుగోళ్లపై హైకోర్టుకు కేసీఆర్...

ముద్ర,తెలంగాణ:-బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో రైల్ రోకోకు పిలుపునిచ్చారంటూ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలంటూ సోమవారం రోజున (జూన్ 24న) హైకోర్టును కేసీఆర్ ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌పై న్యాయస్థానం స్టే విధించింది. కాగా.. ఈరోజు కేసీఆర్ మరో రిట్ పిటిషన్ దాఖలు చేశారు గులాబీ బాస్. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో విద్యుత్ కొనుగోళ్లపై వస్తున్న ఆరోపణలపై రేవంత్ రెడ్డి సర్కార్ జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్ వేసి విచారణ జరిపిస్తుండగా.. ఆ కమిషన్‌ను రద్దు చేయాలంటూ హైకోర్టులో కేసీఆర్ రిట్ పిటిషన్ వేశారు.

జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్ ఏర్పాటు అనేది.. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పిటిషన్‌లో కేసీఆర్ పేర్కొన్నారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని కేసీఆర్ వివరించారు. పిటిషన్‌లో ప్రతివాదులుగా కమిషన్, జస్టిస్ నరసింహా రెడ్డిని చేర్చారు.అయితే.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్‌.. కేసీఆర్‌ను విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై స్పందించిన కేసీఆర్.. కమిషన్‌కు 12 పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. అంతే కాకుండా.. జస్టిస్ నరసింహారెడ్డిని కమిషన్ ఛైర్మన్ బాధ్యతల నుంచి వైదొలగాలంటూ కేసీఆర్ కోరడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.కేసీఆర్ రాసిన లేఖపై కమిషన్ స్పందిస్తూ.. లేఖలో ఆయన ప్రస్తావించిన విషయాలను పరిశీలిస్తున్నామని తెలిపింది. వాస్తవాలకు, కేసీఆర్ చేసిన ఆరోపణలు సరిపోలుతున్నాయా లేదా అనేది లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని కమిషన్ పేర్కొంది.