కల్తీ మద్యం తాగి 34 మంది దుర్మరణం

కల్తీ మద్యం తాగి 34 మంది దుర్మరణం
  • తమిళనాడులో ఘటన
  • స్టాలిన్ రాజీనామా చేయాలని ఏఐఏడీఎంకే డిమాండ్
  • చనిపోయిన వారి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
  • సీఎం స్టాలిన్, గవర్నర్ రవి సంతాపం

ముద్ర వార్తలు, సెంట్రల్ డెస్క్ : తమిళనాడు రాష్ట్రం కళ్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం తాగి 34 మంది మరణించారు. మరో 107 మందిని కళ్లకురిచి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్పించినట్టు అధికారులను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తాసంస్థ నివేదించింది. వీరిలో 59 మందిని మరింత ఉత్తమ చికిత్స అందించడానికి సేలం, విల్లుపురం, పుదుచ్చేరి తదితర ప్రాంతాలలోని ఆస్పత్రులకు రిఫర్ చేశారు. ఈ దుర్ఘటనపై ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె.పళనిస్వామి స్పందిస్తూ అధికార డీఎంకేపై విమర్శల దాడి చేశారు. డీఎంకే అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

      ఈ దుర్ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలిపారు. ఈ దుర్ఘటనను అరికట్టడంలో విఫలమైన అధికారులపై త్వరితగతిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.50,000 ప్రభుత్వం అందజేస్తుందని ప్రకటించారు. ఈ కేసులో నేరానికి పాల్పడిన వారిని అరెస్టు చేశారు. దీన్ని నిరోధించడంలో విఫలమైన అధికారులపై కూడా చర్యలు తీసుకున్నామని తెలిపారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి కూడా సంతాపం ప్రకటించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తమిళనాడు అసెంబ్లీలో కల్తీసారా మృతులకు సంతాపం పాటించారు.

     బిజినెస్ టుడే కథనం ప్రకారం, కళ్లకురిచి జిల్లా కరుణాపురంలో రోజువారీ కూలీలు ప్యాకెట్లు, సాచెట్లలో విక్రయించే ఈ కల్తీ మద్యం తాగారు.  రాత్రి సమయానికి వారిలో చాలామందికి విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి, కళ్లలో చికాకు వంటి లక్షణాలు కన్పించాయి. బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. తమిళనాడు పోలీసులు గోవింద్‌రాజ్ అకా కన్నుకుట్టి అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 200 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరీక్షించగా, మద్యంలో మెంథాల్ ఉందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తేలింది.