బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్... సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే...

బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్... సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే...
  • హస్తం గూటికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్
  • జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి
  • ఇప్పటివరకు ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి జంప్

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన జగిత్యాల ఎమ్మెల్యే ఎం.సంజయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం రాత్రి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

కాగా ఈ చేరికతో మొత్తం ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినట్టయింది. ఇటీవలే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హస్తం పార్టీలో చేరారు. అంతకంటే ముందు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విషయానికి వస్తే 2018లో ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి గెలిచారు. సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్‌‌లో చేరినట్టుగా ప్రచారం జరుగుతోంది.