ఎయిమ్స్ ఈఎన్ టీలో కొత్త యంత్రపరికరాలు

ఎయిమ్స్ ఈఎన్ టీలో కొత్త యంత్రపరికరాలు
  • నవజాత శిశులలో వినికిడి లోపం గుర్తించడానికి వీలు
  • కార్యనిర్వాహక సంచాలకుడు డాక్టర్ వికాస్ భాటియా

 బీబీనగర్, ముద్ర ప్రతినిధి: బీబీనగర్ లోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (AIIMS)లోని చెవి, ముక్కు,గొంతు (ENT) విభాగంలో కొత్త యంత్రపరికరాలను ఏర్పాటు చేశారు. అక్కౌస్టిక్ ఎమిషన్ (OAE) తో పాటు బ్రెయిన్ స్టెమ్ ఈవోక్డ్ రెస్పాన్స్ ఆడియో మెట్రీ (BERA) గదిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వికాస్ భాటియా మాట్లాడుతూ నియోనాటల్ హియరింగ్ స్క్రీనింగ్ ప్రోగ్రాం ప్రారంభాన్ని ఈ విభాగాల ఏర్పాటు సూచిస్తుందని తెలిపారు. నవజాత శిశువు (NEWBORNS)లలో వినికిడి లోపాన్ని ముందుగానే గుర్తించడం ప్రాముఖ్యతను వివరిస్తూ, బీబీనగర్ ఎయిమ్స్ లో ఇప్పుడు నవజాత శిశువులకు వినికిడి లోపాన్ని పరీక్షించడానికి అధునాతన సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని అన్నారు. ఈ యంత్రపరికరాల సాయంతో వినికిడి సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించగలుగుతామని చెప్పారు. వినికిడి లోపం వున్న పిల్లలకు నాణ్యమైన జీవితాన్ని అందించడానికి ముందస్తుగా తెలుసుకోవడం చాలా కీలకమని చెబుతూ, ఈ సౌకర్యాన్ని వారి పిల్లలకు ఉపయోగించుకోవాలని ఆయన ప్రజానీకాన్ని కోరారు. కొత్తగా ఎయిమ్స్ లో ఏర్పాటు చేసిన OAE, BERA గది నవజాత శిశువులలో నొప్పి కలిగించకుండా, వేగంగా వినికిడి సమస్యను గుర్తిస్తుందని తెలిపారు. ప్రారంభంలో గుర్తించగలిగినపుడ సకాలంలో పునరావాస కార్యక్రమాలకు మార్గం సుగమమవుతుందని  వికాస్ భాటియా తెలిపారు. ఈ కార్యక్రమంలో డీన్ (అకడమిక్స్) డాక్టర్ రాహుల్ నారంగ్, డీన్ (పరిశోధన) డాక్టర్ సంగీత సంపత్, డీన్ (పరీక్షలు) డాక్టర్ నితిన్ అశోక్ జాన్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అభిషేక్ చంద్ర అరోరా, మైక్రోబయాలజీ  అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.శ్యామలా అయ్యర్ సహా ప్రముఖులు పాల్గొన్నారు.