బిజెపి హటావో దేశ్ కో బచావో

బిజెపి హటావో దేశ్ కో బచావో
  • రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్
  • క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకుందాం
  • కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట కార్మిక సంఘాల మహాధర్నా
  • వందలాదిగా పాల్గొన్న ఉద్యోగులు కార్మికులు

హనుమకొండ : కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని  కార్పొరేట్ అనుకూల బిజెపి ప్రభుత్వం నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు బిజెపి హటావో..దేశ్ కో బచావో నినాదంతో ముందుకు సాగాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ పిలుపునిచ్చారు. జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట బుధవారం మహా ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ విప్ వినయభాస్కర్ మాట్లాడుతూ ప్రజా,కార్మిక వ్యతిరేక విధానాలను పరిపాలనను మోడీ ప్రభుత్వం కొనసాగిస్తున్నదని, జాతీయ సహజ వనరులను, ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా స్వదేశీ,విదేశీ కార్పోరేట్లకు అమ్మి వేస్తున్నదని అన్నారు. డీజిల్, పెట్రోల్,వంటగ్యాస్, ఇతర నిత్యవసర వస్తువుల ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. బిజెపి అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధానమంత్రి ఉద్యోగాలు ఇవ్వకపోగా నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నారని, కనీస వేతనాలు అమలు చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేస్తూ ప్రజాసంపదలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని ఆయన విమర్శించారు.

కార్మికులు పోరాడి సాధించుకున్న పని గంటలను తగ్గిస్తూ యాజమాన్యాలకి అనుకూలంగా రోజుకు 12 నుండి 15 గంటలు పని చేయిస్తున్నారని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. స్వదేశీ నినాదం పేరుతో విదేశీ జపం చేస్తున్నాడని, బిజెపి మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా స్ఫూర్తి తోటి కార్మికులు ప్రజలు ఉద్యోగులు ఐక్యంగా బిజెపిని రాబోయే ఎన్నికల్లో ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట బిక్షపతి,సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేష్ మాట్లాడుతూ కేంద్రం తీసుకు వచ్చిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, రైతాంగానికి కనీస మద్దతు ధర ప్రకటించాలని, కాంట్రాక్టు విధానం రద్దుచేసి కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం కార్మికులకు చట్టపరమైన కనీస వేతనాలు చెల్లించి ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎం.వి యాక్ట్ 2019 ఎలక్ట్రిసిటీ బిల్లు 2022ను వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. 

కేంద్ర సర్కార్ ప్రభుత్వ రంగ మౌలిక వసతులు సహజ వనరులను కార్పోరేట్లు లూటీ చేసే విధానపర నిర్ణయాలను మోడీ ప్రభుత్వం అమలు చేస్తుందని వ్యూహాత్మక అమ్మకాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల్లో 100 శాతం వాటాలు తెగ నమ్ముతున్నదని నేషనల్ పైపులైన్ పాలసీ ద్వారా మౌలిక వసతులను లీజు పేరుతో 30 సంవత్సరాల నుండి 99 సంవత్సరాలకు పెట్టుబడి కార్పోరేట్ దారులకు దారాదత్తం చేస్తూ జాతీయ రహదారులు రైళ్లు, విద్యుత్ స్టేషన్లో ట్రాన్స్ మిషన్, చమురు సహజవాయువు పైపులైన్లు, బొగ్గు గనులు, టెలికం, విమానాశ్రయాలు, ఓడరేవులు, ఎఫ్ సిఐలు మొత్తం కూడా ప్రైవేటీకరణ  చేస్తున్నారని  తీవ్రంగా దుయ్యబట్టారు. దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. 

ఈ మహా ధర్నా కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు టి ఉప్పలయ్య ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి తోట బిక్షపతి బి ఆర్ టి యు జిల్లా నాయకులు నాయని రవి అధ్యక్ష వర్గంగా వ్యవహరించగా మహా ధర్నాలో కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, కార్మిక సంఘాల జేఏసి కన్వనర్ పుల్ల శ్రీనివాస్, ఏఐటీయూసి జిల్లా అద్యక్షుడు జక్కు రాజు గౌడ్,నాయకులు మద్దెల ఎల్లేష్,నేదునూరి రాజమౌళి,మునిగాల బిక్షపతి, రాజేందర్,శంకర్,సిఐటియు నాయకులు గాదె ప్రభాకర్ రెడ్డి మెట్టు రవి ,బొట్లచక్రపాణి, వేల్పుల సారంగపాణి, టీఆర్ఎస్ కేవి నాయకులు ఎంజాల మల్లేషం, ఐఎన్ టీ యు సి నాయకులు మామిడి శ్యామసుందర్, ఐఎఫ్టియు నాయకులు నున్న అప్పారావు, ఆరెల్లి కృష్ణ తో పాటు వందలాదిమంది కార్మికులు పాల్గొన్నారు.