నిస్సహాయ మహిళల చేయూత ప్రభుత్వ ధ్యేయం
- వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్
- మెదక్ లో భరోసా కేంద్ర భవనం ప్రారంభం
ముద్ర ప్రతినిధి, మెదక్:నిస్సహాయ స్థితిలో ఉండే మహిళలకు చేయూతనిచ్చి ప్రభుత్వం అన్ని విధాల ఆడుకుంటుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి. దామోదర్ రాజానర్సింహ అన్నారు. మెదక్ రైల్వే స్టేషన్ సమీపంలో 2 కోట్ల వ్యయంతో నిర్మించిన భరోసా కేంద్రం, షీ టీం భవనాన్ని స్థాకనిక ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ...టీజింగ్ కు గురైన మహిళలు, అమ్మాయిలు, ఆడ పిల్లలు లైంగిక వేధింపులకు గురైన అమ్మాయిలకు, అత్తింటి వారి ఆగడల బారిన పడిన మహిళలు, గృహహింసకు గురైన మహిళల కోసం భరోసా కేంద్రం రక్షణగా ఉంటుందన్నారు. మహిళలకు రక్షణతో పాటు వసతి, కౌన్సిలింగ్, న్యాయ సహాయం కోసం, అవసరమైన వైద్య సదుపాయాలను కల్పించడం కోసం ఆధునిక హంగులతో నూతన భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు. 2022 ఆగస్టు నుంచి ఇప్పటివరకు 135 కేసులు నమోదు అయ్యాయని, బాధితులకు సుమారు 27 లక్షల పైచిలుకు ఆర్థిక సహాయం అందించారన్నారు.
కేసు నమోదు నుండి చివరగా జడ్జ్మెంట్ వచ్చే వరకు సంపూర్ణ ఆర్థిక మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు. మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అన్నారు. పోలీసులు, మానసిక కౌన్సిలింగ్ నిపుణులు ద్వారా బాధిత మహిళలకు, పిల్లలకు అండగా నిలిచేందుకు ఈ కేంద్రం దోహదపడుతుందన్నారు. బాధిత మహిళలకు భరోసా కేంద్రాలు అండగా నిలుస్తాయని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మానసిక వేదనకు గురికాకుండా కాపాడే విధంగా ఈ భరోసా సెంటర్ పనిచేస్తుందని తెలిపారు. భరోసా కేంద్రలు లేని జిల్లాలో త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం భరోసా కేంద్రం ఆవరణలో మంత్రి మొక్కను నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో డిఐజి రెమా రాజేశ్వరీ, కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్ పి డా.బాలస్వామి, డిఎంహెచ్ఓ డా.చందు నాయక్, డిసిహెచ్ డా. చంద్రశేఖర్, జిల్లా సంక్షేమాధికారి బ్రహ్మాజీ, అడిషనల్ కలెక్టర్ మహేందర్, తహసీల్దార్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుప్రభాతరావు, ఆవుల రాజిరెడ్డి, రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్, బొజ్జ పవన్, హఫీజుద్దీన్, గూడూరి కృష్ణ, గూడూరి ఆంజనేయులు గౌడ్, కౌన్సిలర్ రాజలింగం, ఎఎంసి మాజీ చైర్మన్ మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు.