BiG BREAKING: పెద్ద అంబర్ పేట వద్ద పోలీసు కాల్పులు

BiG BREAKING: పెద్ద అంబర్ పేట వద్ద పోలీసు కాల్పులు
  • దోపిడీ దొంగలు పార్థా గ్యాంగ్ సభ్యులు
  • జాతీయ రహదారిపై దారికాచి దోపిడీలు
  • నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర ప్రత్యేక నిఘా

ముద్రవార్తలు, హైదరాబాద్: హైదరాబాద్లోని పెద్ద అంబర్ పేట వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై దోపిడీ దొంగల ముఠా పార్థా గ్యాంగ్ ను పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంలో పోలీసులు ఫైరింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నల్గొండ ప్రాంతంలో గత కొంతకాలంగా వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ దోపిడీ దొంగలను పట్టుకోవడానికి నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేకంగా నిఘావుంచి,  వేట మొదలు పెట్టారు. గురువారం రాత్రి నల్గొండ ప్రాంతంలో దొంగతనం చేసిన పార్థాగ్యాంగ్ సభ్యులు తిరిగి హైదరాబాద్ వైపు వాహనంలో వెళ్లిపోతుండగా, వారిని పోలీసులు వెంబడించారు. పెద్ద అంబర్ పేట సమీపంలో వారు యూటర్న్ చేసుకుంటున్న సమయంలో వారిని పోలీసులు అడ్డగించారు. ఈ సందర్బంలో వారిపై కత్తులు, ఇతర మారణాయుధాలతో దోపిడీ దొంగలు దాడికి పాల్పడ్డంతో, పోలీసులు వారిని భయపెట్టేందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది.

 నగరంలో పోలీసు కాల్పుల మోతతో ఒక్కసారిగా కలకలం రేగింది. మొత్తం మీద పోలీసులు ఈ గ్యాంగ్ లో మొత్తం నలుగురు దోపిడీ దొంగలను పట్టుకున్నారు. ముఖ్యంగా ఈ పార్థా గ్యాంగ్ జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్న వారి వాహనాలను అడ్డగించి దోపిడీలకు పాల్పడుతుంటారు. అలాగే గత కొంత కాలంగా నల్గొండ తదితర ప్రాంతాలలో దోపిడీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు హైవేపై నిలిచిపోవడంతో, నలుగురు దొంగలు అందులో ప్రయాణికులను బెదిరించి వారి మెడల్లో బంగారు ఆభరణాలను దోచుకున్నారు. అలాగే ఇటీవలే నకిరేకల్ పట్టణంలో ఒక ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు. గత కొంతకాలంగా నల్గొండ జిల్లా పరిధిలో కూడా పలు దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీంతో నల్గొండ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శరత్ చంద్ర దీన్ని సవాల్ గా తీసుకున్నారు. అప్పటి నుంచి దోపిడీ దొంగల కోసం వేట ముమ్మరం చేశారు. గత ఇరవై రోజులుగా నల్గొండ క్రైమ్ బ్రాంచి పోలీసులు చేస్తున్న వేట ఫలించి పార్థా గ్యాంగ్ కు సంబంధించిన నలుగురు దొంగలను పట్టుకోగలిగారు. ఈ గ్యాంగ్ సభ్యులు దొంగతనాలకు పాల్పడే సమయంలో హత్యలక కూడా వెనుకాడరని చెబుతున్నారు.