బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు

బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు

సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు

ఎమ్మెల్యేలు, కీలక నేతల వలసలతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దండె విఠల్‌, ఎం.ఎస్‌. ప్రభాకర్‌, భాను ప్రసాద్‌, సారయ్య, యెగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్‌ గురువారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ నివాసంలో ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాగా బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే  దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్‌ కుమార్‌, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే. కాగా త్వరలోనే మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి.