గ్రామీణ రోడ్లకు నిధులు

గ్రామీణ రోడ్లకు నిధులు

చిగురుమామిడి ముద్ర న్యూస్: మండలంలోని వివిధ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కోసం నిధులు విడుదలయ్యాయి. మండలంలోని సుందరగిరి నుంచి ఉల్లంపల్లి వరకు మూడు కిలోమీటర్ల బీటీ రోడ్డుకు రూ.2.25కోట్లు మంజూరు చేస్తున్నట్లు హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ తెలిపారు. హుస్నాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

అలాగే చిగురుమామిడి మండల కేంద్రం నుంచి ముదిమాణిక్యం వరకు రెండు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.1.50 కోట్లు మంజూరు చేశారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేందుకు అనుకూలంగా రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించిన ఎమ్మెల్యేకు స్థానిక ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న బీటీ రోడ్లు మంజూరు కావడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.