మండల పరిషత్ ప్రతినిధులకు ఘనంగా వీడ్కోలు

మండల పరిషత్ ప్రతినిధులకు ఘనంగా వీడ్కోలు

బీబీనగర్, ముద్ర ప్రతినిధి: విద్యారంగంతో పాటు మహిళల అభ్యున్నతికి ప్రభుత్వపరంగా అందిన వనరుల మేరకు గడిచిన అయిదేళ్లలో ప్రగతి సాధించామని బీబీనగర్ మండల పరిషత్ అధ్యక్షుడు ఎర్కల సుధాకర్ గౌడ్ తెలిపారు. బీబీనగర్ మండల పరిషత్తు సమావేశ మందిరంలో సోమవారం ప్రజాప్రతినిధులకు ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీబీనగర్ జిల్లా ప్రాదేశిక సభ్యురాలు గోలి ప్రణీత పింగళ్ రెడ్డితో పాటు అందరు ఎంపీటీసీ సభ్యులు, తాజా మాజీ సర్పంచులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్య అథిగా పాల్గొన్న ఎంపీపీ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ గత కోవిడ్ సమయంలో మండలంలోని అందరు ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో జాతీయ స్థాయిలో ఎక్కువశాతం కోవిడ్ వ్యాక్సినేషన్ వేసిన మండలంగా బీబీనగర్ గుర్తింపు పొందిందని అన్నారు. విద్యాభివృద్ధితోనే ప్రగతి ఆదారపడివుంటుందని భావించిన అందరం కలిసి ముఖ్యంగా మండలంలో విద్యాభివృద్ధికి విశేష కృషి చేశామని తెలిపారు. మండలంలోని అనేక పాఠశాలలలో విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించామని తెలిపారు. అలాగే పాఠశాలలలో వసతుల మెరుగుకు వనరుల లభ్యత మేరకు ప్రయత్నించామని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యులు, తాజా మాజీ సర్పంచులు, జడ్పీటీసీ సభ్యురాలు ప్రణీత పింగళ్ రెడ్డి సహా అందరూ అయిదేళ్ల పదవీ కాలంలో తమ అనుభవాలను వివరించారు. మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస రెడ్డి, మండల రెవెన్యూ అధికారి శ్రీధర్ కూడా ప్రజా ప్రతినిధులతో తాము ఎలా సమన్వయంగా వ్యవహరించినదీ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు పంజాల రామాంజనేయ గౌడ్, గోలి నరేందర్ రెడ్డి, టంటం భార్గవ్, మండలంలోని అన్ని విభాగాల అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చివరిలో ఎంపీపీ సుధాకర్ గౌడ్, జడ్పీటీసీ సభ్యురాలు గోలి ప్రణీత పింగళ్ రెడ్డి తదితరులకు ప్రజా ప్రతినిధులు, అధికారులు శాలువాలతో సత్కరించారు. బీబీనగర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుదర్శన్ సారథ్యంలో విలేకరులంతా కలిసి ఎంపీపీ, జడ్పీటీసీలను సత్కరించారు.