యథేచ్ఛగా మొరం దందా.. అనుమతులు లేకుండా తవ్వకాలు..

యథేచ్ఛగా మొరం దందా.. అనుమతులు లేకుండా తవ్వకాలు..

ముద్ర న్యూస్ రేగొండ : మండలం లో అక్రమ మొరం దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. కొందరు అక్రమార్కులు సహజ సంపదను కొల్లగొట్టి ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే తవ్వకాలు సాగిస్తుండడంతో లక్షల రూపాయల్లో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. రేగొండ మండలంలోని రూపిరెడ్డి పల్లి గ్రామ శివారులో గల సమ్మయ్య కుంట గంగారావి చెరువు లో కొందరు అక్రమార్కులు అనుమతులు లేకుండానే మొరం మట్టి తవ్వున్నారు. చెరువులని పందికొక్కుల తోడేస్తున్నారు. నిఘా బెట్టి చర్యలు చేపడుతున్నామని రెవెన్యూ అధికారులు చెబుతున్నా.. ఈ అక్రమ దందా వ్యాపారంలో పాత్ర ఉన్న బడా రాజకీయ నాయకుల మొరం మట్టి తరలింపు ట్రాక్టర్లను పట్టుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అసలు ఏం జరుగుతోంది:
రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందు కోగా, ఎక్కడపడితే అక్కడ వెంచర్లు వెలిశాయి. మండలంలో  పరకాల పట్టణ, పరిసర ల్లో వెలసిన వెంచర్లకు, గృహ నిర్మాణాలకు మొరం అవసరం కావడంతో మండలంలోని కనబడ్డ చెరువుల పై అక్రమ వ్యాపారుల కన్ను పడింది. అక్రమ వ్యాపారులు జేసీబీ యంత్రాలతో పగలు రాత్రి వేళల్లో చెరువుల్లో మొరం మట్టిని తోడేస్తూ ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా వెంచర్ లకు, గృహ నిర్మాణాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

ఒక్కొక్క ట్రాక్టర్ లోడ్ మొరం మట్టికి రూ.650 నుంచి రూ.700 వరకు, దూరం ఎక్కువైతే అదనంగా మరో రూ.100 నుంచి రూ.200 వరకు వసూలు చేసుకుంటున్నారు. టిప్పర్ లోడ్ మొరానికి రూ 2వేల నుంచి రూ. 2500 తీసుకుంటూ లక్ష రూపాయల్లో అక్రమార్జన చేస్తూ మూడు పువ్వులు ఆరు కాయలు గా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. గుట్టని తోడేస్తున్న వారిలో కొందరు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. రెవెన్యూ అధికారులు అక్రమ మొరం మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకుంటున్నా.. అందులో అక్రమ వ్యాపారం చేస్తున్న రాజకీయ నాయకులు కాకుండా మామూలు వ్యక్తులు పట్టు పడుతుండటం గమనార్హం.

నిబంధనలు బేఖాతరు..

ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో మొరం, మట్టి తవ్వకాలు చేపట్టాలంటే మండల రెవెన్యూ, భూగర్భ గనుల అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ మేరకు వాల్టా చట్టం ప్రకారం ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించి తవ్వకాలు చేపట్టాలి. ఆ నిబంధనలను తుంగలో తొక్కుతూ అక్రమార్కులు గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.