వరంగల్ మిరపకాయ చాలా ఘాటు..!
- మిరపకాయ ఎవరికి.. ఎక్కడ పెట్టాలో సీఎంకు తెలుసు..!!
- మహబూబాబాద్ లో మంత్రి పొంగులేటి
ముద్రప్రతినిధి, మహబూబాబాద్: వరంగల్ గడ్డమీద నుంచి చెబుతున్నా.. వరంగల్ మిరపకాయ చాలా ఘాటు, ఆ మిరపకాయ ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ పెట్టాలో.. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాగా తెలుసు అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జన జాతర బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ మధ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవాకులు చెవాకులు పేలుతున్నారని నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు.
మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లిల్లీపుట్ తో పోలుస్తున్నారని, ఇరవైమంది ఎమ్మెల్యేలు, మంత్రులు తనకు టచ్ లో ఉన్నారని, రేవంత్ రెడ్డి బిజెపిలోకి పోతారని, శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ లోకి వస్తారని కేసీఆర్ పోరంబోకు లాగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.అలా అనడానికి కేసీఆర్ కు సిగ్గుందా.., ఏ విశ్వసనీయత ఉందని కేసిఆర్ దగ్గరికి ఎవరైనా వస్తారా అంటూ ప్రశ్నించారు. చిప్పకూడు తినేళసయం ఎంతో దూరంలో లేదని, కేసిఆర్ కుటుంబం చిప్పకూడు తింటుందని తెలిపారు.
కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేకుండా ఫోన్ టాపింగులు చేసిన పాపం ఊరికే పోదని, ఫోన్ టాపింగ్ కు పాల్పడిన కేసీఆర్ తో పాటు దాంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి శిక్ష ఖచ్చితంగా పడుతుందని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనలో ఇచ్చిన హామీలు నెరవేర్చారా.. కేంద్రమంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డి సమాదానం చెప్పాలన్నారు. గతంలో ఉన్న నాలుగు యంపి సీట్లుకూడా బిజేపికి రావన్నారు. బలరాంనాయక్ ను మహబూబాబాద్ యంపిగా అధికమెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.