డోర్నకల్ నియోజకవర్గంలో ఇంటి దొంగలతోనే ఇబ్బంది..! 

డోర్నకల్ నియోజకవర్గంలో ఇంటి దొంగలతోనే ఇబ్బంది..! 
  • నన్ను ఓడించాలని కుట్రలు చేసారు.. మళ్ళీ చేస్తారు..!! 
  • గుంట నక్కలు రాబందులు పొంచుకొని ఉంటాయి 
  • అయినా మీ అభిమానంతో బిఆర్ఎస్ గెలుస్తుంది
  •  ఆత్మీయసమ్మేళనంలో డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ సంచలనవ్యాఖ్యలు..

ముద్రప్రతినిధి‌, మహబూబాబాద్: డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటి దొంగలతోనే తనకు ఇబ్బంది ఉందని, బిఆర్ఎస్ పార్టీలో ఉంటూ  లక్షలు సంపాదించుకుంటున్నవారే పార్టీకి అన్యాయం చేయాలని, తనను ఓడించాలని కుట్రలు చేస్తున్నారని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని అయ్యగారిపల్లి గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన భారాస ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ ఇంటి దొంగలంటూ సొంత పార్టీ నేతలపైనే నర్మగర్భంగా విరుచుకుపడ్డారు. మొదటి నుంచి తనను చూస్తేనే వారికి భయమని, తనకు నష్టం జరగాలని, తాను లేకుండా పోవాలని అనుకుంటారని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా డోర్నకల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, తాను ప్రజల కోసం చేస్తున్న సేవ బిఆర్ఎస్ ను గెలిపిస్తాయని అన్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాబందులు, గుంటనక్కలు పొంచుకొని కూర్చుంటాయని, వారి కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. తాను ఎమ్మెల్యేగా విజయం సాధించే నాటికి డోర్నకల్ నియోజకవర్గంలో ఒక్క గ్రామానికి కూడా తారురోడ్డు లేదని,  నియోజకవర్గంలో సాధించిన ప్రతి అభివృద్ధి తాను సాధించిందేనన్నారు. ఒక సామాన్య గిరిజనకుటుంబంలో జన్మించిన తనను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన డోర్నకల్ నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని ఎప్పుడూ మర్చిపోనని, ఊపిరి ఉన్నంతవరకు నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని రెడ్యానాయక్ ప్రకటించారు.

తాను ఒక్కసారి ఓడిపోయానని.. అప్పుడు గెలిచిన వారు కనీసం నియోజకవర్గంలో ఒక్కబోరు కూడా వేయించలేకపోయారని తెలిపారు. దీంతో  నియోజకవర్గ ప్రజలు రెడ్యానాయక్ మాత్రమే తమకు సేవ చేసే వ్యక్తి అనే నమ్మకంతో ఐదువేల ఓట్లతో ఓడించిన వారే.. వేలాది ఓట్ల మెజారిటీతో విజయాన్ని అందించారని తెలిపారు. మీరు అందించిన శక్తితోనే పనిచేస్తున్నానని మీ ఆశీస్సుల బలంతో, ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో డోర్నకల్ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఎవరు ఎన్ని ఎత్తుగడలు వేసిన, సొంత పార్టీలోనే ఉంటూ కుట్రలు చేసిన, బిఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు.  మీరే..నాబలం., మీరంతా నా..బలగం అని రెడ్యానాయక్ అన్నారు.