భూపాలపల్లికి 9న మంత్రి కేటీఆర్ రాక..

భూపాలపల్లికి 9న మంత్రి కేటీఆర్ రాక..
  • ప్రారంభం కానున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు..
  • విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గండ్ర పిలుపు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి ఈ నెల 9న ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విచ్చేస్తున్నారని, ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో రూ.50 కోట్లతో సమీకృత కలెక్టర్ కార్యాలయం, రూ.40 కోట్లతో ఎస్పీ కార్యాలయం భవనాలు నిర్మాణాలు పూర్తయి ప్రారంభానికి సిద్ధమయ్యాయని అన్నారు. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా కార్యాలయాలు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందని, అదేవిధంగా రెండో విడత పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించనున్నారని, అనంతరం బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆయా మండలాల నుండి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హ జరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, మార్కెట్ చైర్మన్ పోలుసాని లక్ష్మీనర్సింహరావు, పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.