ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట భేటీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట భేటీ
  • రాష్ట్రంలో పెట్టుబడులపై ముఖ్యమంత్రి, వైస్ ప్రెసిడెంట్ మధ్య చర్చ
  • నాణ్యమైన సేవలు అందించేందుకు తమ వద్ద సాంకేతికత ఉందన్న చంద్రశేఖర్ 
  • గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్ ఫామ్‌ల ద్వారా సాధ్యమయ్యే రహదారి భద్రతపై చర్చ

గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట తన ప్రతినిధులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులపై వారి మధ్య చర్చ జరిగింది. ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి గూగుల్ వైస్ ప్రెసిడెంట్ సంసిద్ధతను వ్యక్తం చేశారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతిరంగాన్ని ప్రభావితం చేస్తోందని... వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో తెలంగాణ కోసం డిజిటలైజేషన్ అజెండాను అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావడంతో పాటు తెలంగాణ పౌరుల అవసరాలను తీర్చడానికి నాణ్యమైన సేవలను అందించేందుకు విస్తృతమైన సాంకేతికత, నైపుణ్యం తమ వద్ద వున్నాయని ముఖ్యమంత్రికి చంద్రశేఖర్ వివరించారు.

ఈ సందర్భంగా గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్ ఫామ్‌ల ద్వారా సాధ్యమయ్యే రహదారి భద్రతపై కూడా ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాల్గొన్నారు.