సబ్ సెంటర్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి:జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

సబ్ సెంటర్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి:జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి :గద్వాల:జిల్లాలలో అందుతున్న వైద్య సేవలపై జిల్లా కలెక్టర్, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ  మంత్రి తన్నీరు హరీష్ రావు నిర్వహించిన వీడియో సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్.సబ్ సెంటర్ల నిర్మాణ టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రాష్ట్ర స్థాయి వైద్య శాఖ ఉన్నత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ లు,  వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో జిల్లాలలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ ఛాంబర్ నుండి  జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ,  గర్భిణీ స్త్రీలలో అనీమియా సమస్య పరిష్కరించేందుకు  ప్రభుత్వం కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం అమలు చేస్తుందని, మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని అమలు చేసామని ప్రస్తుతం మిగిలిన 24 జిల్లాలకు విస్తరిస్తున్నామని మంత్రి అన్నారు.
పుట్టబోయే బిడ్డల ఆరోగ్యం, తల్లి సంరక్షణ కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఉపయోగ పడుతుందని, ప్రతి గర్భిణీ స్త్రీకి 2 సార్లు కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ అందిస్తామని, రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల సందర్భంగా కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం లాంచ్ చేయాలని మంత్రి తెలిపారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6.84 లక్షల మంది గర్భిణీ స్త్రీలు ఉంటారని, 2వ ఏ.ఎన్.సి రిజిస్ట్రేషన్, 3వ ఏ.ఎన్‌.సి  రిజిస్ట్రేషన్ సమయంలో 2 సార్లు గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్ ఇస్తామని, రాష్ట్రవ్యాప్తంగా 111 కేంద్రాలను గుర్తించామని, అక్కడ న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని, దీనివల్ల అనీమియా సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి తెలిపారు. కెసిఆర్ కిట్ పథకం వల్ల రాష్ట్రంలో అద్భుతమైన ఫలితాలు వచ్చాయని   ఎంఎంఆర్, ఐఎంఆర్ రేట్ల నియంత్రణలో  దేశంలో 3వ స్థానంలో నిలిచామని, వంద శాతం ఇన్సిస్టిట్యూషన్ డెలీవరిలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ వల్ల కూడా మంచి ఫలితాలు సాధిస్తామని మంత్రి ఆకాంక్షించారు.
రాష్ట్ర వ్యాప్తంగా  నూతనంగా 2038   ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ లను మంజూరు చేశామని, 422 సబ్ సెంటర్ నిర్మాణ పనులు పూర్తి చేశామని, మరో 177 పనులు చివరి దశలో ఉన్నాయని, 610 నిర్మాణ పనులు వివిధ దశలో ఉన్నాయని అధికారులు వివరించారు. రాష్ట్రంలో 63 సబ్ సెంటర్ భవనాలకు భూకేటాయింపులు జరగలేదని, వీటిపై కలెక్టర్ లు శ్రద్ధ వహించి గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉండే భూములను ఎంపిక చేసి సబ్ సెంటర్ల కేటాయించాలని, సబ్ సెంటర్ లలో నిర్మాణం కోసం  ముందస్తుగా జిల్లా ప్రజా పరిషత్తులకు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలకు నిధులను విడుదల చేశామని, వారం రోజులలో మరో 400 కోట్ల నిధులు విడుదల చేస్తామని మంత్రి పేర్కొన్నారు. సబ్ సెంటర్ భవన నిర్మాణానికి నిధుల సమస్య లేనందున త్వరితగతిన 766 సబ్ సెంటర్ల టెండర్ల ప్రక్రియ ఫైనల్ చేసి పనులు ప్రారంభించాలని, సబ్ సెంటర్ లను త్వరితగతిన వేగంగా నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని, సబ్ సెంటర్ల నిర్మాణ పురోగతిపై కలెక్టర్లు తరచుగా రివ్యూ నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.జిల్లాలకు నూతనంగా మంజూరు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాలు, బస్తీ, పల్లె దవాఖానాలు, డయాగ్నోస్టిక్ హబ్ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని మంత్రి అధికారులను కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 3208  పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, వీటిలో ఇప్పటికే 2995 మైల్డ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లను నియమించామని, ప్రస్తుతం ఖాళీగా ఉన్న 211 పోస్టులను జిల్లా స్థాయిలో భర్తీ చేయాలని మంత్రి తెలిపారు. ఎం.ఎల్.హెచ్.పి కింద ఎంపిక చేసిన 1141  బి.ఎ.ఎంఎస్  అభ్యర్థులకు 6 నెలల పాటు బ్రిడ్జి కోర్స్ శిక్షణ అందించాలని వీటిలో ఇప్పటివరకు 708 మంది అభ్యర్ధులకు శిక్షణ పూర్తి చేశామని, 201 మంది అభ్యర్థులకు శిక్షణ ప్రక్రియ జరుగుతుందని, కంటి వెలుగు కార్యక్రమం చివరి దశకు వచ్చినందున మిగిలిన అభ్యర్థులకు సైతం బ్రిడ్జి కోర్సు ప్రారంభించాలని మంత్రి పేర్కొన్నారు.
80 పనిదినాలు లో రాష్ట్రవ్యాప్తంగా కోటిన్నర మంది ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా కంటి పరీక్షలను విజయవంతంగా నిర్వహించి నందుకు మంత్రి కలెక్టర్లను,వైద్య  సిబ్బందిని అభినందించారు. రాష్ట్రంలో 1.5 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 21.4 లక్షల మందికి రీడింగ్ గ్లాసెస్, 17.08 లక్షల మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ పంపిణీ చేశామని మంత్రి తెలిపారు. కంటి వెలుగులో లక్ష్యాన్ని పూర్తి చేసుకున్న 737 బృందాలలోని స్టాఫ్ నర్స్ లు,  ఏఎన్ఎమ్ లు, వైద్యాధికారులను ఆసుపత్రు లలో విధులకు పంపాలని, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆప్తామాలజిస్టులను మిగిలి ఉన్న కంటి వెలుగు బృందాలకు అటాచ్ చేసి మరింత విస్తృతంగా ప్రజలకు పరీక్షలు నిర్వహించాలని మంత్రి సూచించారు. సిపిఆర్ శిక్షణ పై వైద్యాధికారులు శ్రద్ధ వహించాలని, నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు సి పి ఆర్ ఫై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా మరో 15 రోజుల పాటు తీవ్రమైన ఎండలు ఉంటాయని, ఎండల కారణంగా వడదెబ్బ బారిన ప్రజలు పడకుండా అవసరమైన సూచనలు సలహాలు అందజేయాలని, ఉపాధి హామీ కార్మికులు పనిచేసే సమయంలో అవసరమైన జాగ్రత్తలు పాటించాలని మంత్రి సూచించారు.
వీడియో సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ, కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ కోసం జాగ్రత్తగా ఏర్పాట్లు చేయాలని, న్యూట్రిషన్ కిట్లు అందించే పరికరాల నాణ్యతను ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని, గర్భిణి స్త్రీలు అధిక సమయం వేచి చూడకుండా త్వరగా కార్యక్రమాన్ని జరిగేలా ప్రణాళికలు తయారు చేసుకోవాలని అధికారులకు సూచించారు. 
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సబ్ సెంటర్ నిర్మాణ పనులకు నిధులు  అందుబాటులో ఉన్నాయని, త్వరితగతిన  టెండర్లను పిలిచి పనులు ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా  కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. 
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శశికళ, పి ఆర్ ఇంజనీర్ ఆంజనేయులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.