కేసీఆర్ బస్సు యాత్రకు భారీ స్పందన

ముద్ర, తెలంగాణ వార్తలు: భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బస్సు యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోంది. వేలాది మంది ప్రజానీకం దారిపొడవునా కేసీఆర్ కు స్వాగతం పలుకుతున్నారు. కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సుపై పూలు జల్లుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వందలాది మహిళలు బోనాలతో ఎదురేగి స్వాగతం పలుకుతుండడంతో రహదారిపై తీవ్ర రద్దీ ఏర్పడి కేసీఆర్ బస్సు యాత్ర నెమ్మదిగా సాగుతోంది. అర్థగంట నుంచి కిలోమీటర్ కూడా యాత్ర సాగడం లేదని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇక కేసీఆర్ మిర్యాలగూడ మార్గమధ్యంలో నల్గొండ బైపాస్ రోడ్డులో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులను చూసి బస్సును ఆపారు. రైతులు కేసీఆర్ తో తమ గోడు వెల్లబోసుకున్నారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ మీ అందరి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో పోరాటం చేద్దామని, అందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.