నన్ను తిట్టడానికే రాజయ్యను బీఆర్ఎస్‌లో చేర్చుకున్నట్లుగా ఉంది: కడియం శ్రీహరి ఆగ్రహం

నన్ను తిట్టడానికే రాజయ్యను బీఆర్ఎస్‌లో చేర్చుకున్నట్లుగా ఉంది: కడియం శ్రీహరి ఆగ్రహం
  • వరంగల్ నుంచి కావ్య 2 లక్షల మెజార్టీతో గెలవబోతుందని జోస్యం
  • బీఆర్ఎస్ నుంచి పోటీకి తాను మొదటి నుంచి విముఖత వ్యక్తం చేస్తున్నానని వెల్లడి
  • బీఆర్ఎస్ నేతల నుంచి సహకారం లేకపోవడంతోనే కావ్య వెనక్కి తగ్గారన్న కడియం శ్రీహరి

వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి తన కూతురు కావ్య 2 లక్షలకు పైగా మెజార్టీతో గెలవబోతుందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జోస్యం చెప్పారు. కేవలం తనను తిట్టడానికే రాజయ్యను తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నట్లుగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మడికొండలో కాంగ్రెస్ సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం కడియం మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీకి మొదటి నుంచి విముఖత వ్యక్తం చేశానన్నారు. అయినా అధినేత టిక్కెట్ ఇవ్వడంతో పోటీకి సిద్ధపడ్డామని... కానీ బీఆర్ఎస్ నేతల నుంచి సహకారం లేకపోవడంతో వెనక్కి తగ్గామన్నారు.

వరంగల్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని... బీజేపీ, బీఆర్ఎస్ రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలన పట్ల ప్రజల్లో సానుకూలత ఉందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తన వ్యక్తిగత అంశాల్లోకి వెళ్లి మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు తన కుటుంబంపై వ్యక్తిగత దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kadiam Srihari, kadiam Kavya, Warangal Urban, District, Lok Sabha Polls