నాడు వెలవెల..  నేడు కళకళ

నాడు వెలవెల..  నేడు కళకళ
  • విద్యుత్ రంగంలో దేశంలోనే మేటిగా తెలంగాణ
  • నాడు కరెంట్​కోతలతో పవర్​హాలిడేలు
  • ప్రస్తుతం 24 గంటల విద్యుత్
  • 7,778 మెగావాట్ల నుంచి 18,567కు పెరిగిన కరెంట్​సామర్థ్యం
  • ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లోడ్ డిస్పాచ్ సెంటర్ అభివృద్ధి 
  • కేసీఆర్​పాలనా దక్షతతో రాష్ట్రంలో అద్భుత ప్రగతి


ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాకముందు నిత్యం విద్యుత్​కోతలతో అల్లాడిన రాష్ట్రం.. ప్రస్తుతం 24 గంటలు విద్యుత్​వెలుగులతో విరాజిల్లుతోంది. విద్యుత్ రంగంలో దేశంలో మరే రాష్ట్రం సాధించలేని ఘనతను తెలంగాణ సొంతం చేసుకుంది. తెలంగాణ వస్తే రాష్ట్రం మొత్తం చీకటిమయం అవుతున్నందన్న అపోహలకు తెరదించుతూ నేడు రాష్ట్రంలోని అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ముందుకు సాగుతోంది. సుమారు రూ.97,321 కోట్లతో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థలను పటిష్టపర్చిన రాష్ట్రం.. అద్భుతమైన ప్రగతి దిశగా దూసుకుపోతున్నది.

  • తెలంగాణ ఏర్పడే నాటికి 7,778  మెగావాట్ల విద్యుత్..

2014 లో తెలంగాణ ఏర్పడే నాటికి 2,700 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ లోటు ఉండేది. 60 ఏoడ్ల సమైక్య పాలనలో వివక్షా పూరితంగా మన బొగ్గు, నీటిని అక్రమంగా తరలించి ఇతర ప్రాంతాల్లో విద్యుత్ ప్లాంట్లు నిర్మించారు. తెలంగాణ ఏర్పడే నాటికి 7,778  మెగావాట్ల మేరకే ఉన్న విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్ల నిర్మాణం జరిగింది. తలసరి విద్యుత్ వినియోగం 1,196 కిలోవాట్లు మాత్రమే ఉండేది. డిమాండ్​కు తగ్గట్టుగా విద్యుత్ సబ్ స్టేషన్లు, లైన్ల నిర్మాణం చేపట్టలేదు. అరకొర కరెంటుతో నిత్యం వ్యవసాయ మోటార్లు , ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోవడం, ఎండిన పంటలతో రైతులు రోడ్డెక్కేవారు. విద్యుత్ కోతలతో వ్యవసాయ రంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. పవర్ హాలిడేస్ తో పరిశ్రమలు మూతపడ్డాయి. దీనితో మనుగడ కోసం రైతులు, శ్రామికులు ముంబై, దుబయి తదితర ప్రాంతాలకు వలస వెళ్లేవారు.

  • శరవేగంగా యాదాద్రి విద్యుత్​కేంద్రం పనులు..

తెలంగాణ తొలి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ పాలనా దక్షతలో 9 ఏళ్ల స్వల్ప కాలంలో విద్యుత్ రంగం అద్భుత ప్రగతి సాధించింది. పూర్తిగా నిర్లక్ష్యం, వివక్షతకు గురైన విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థ లను విస్తరించి, పటిష్ట పరిచారు. ఇందుకోసం ఏటా 10 వేల కోట్లకుపైగా ఖర్చు చేశారు. ఈ రంగంపై ప్రభుత్వంగా భారీగా నిధులను ఖర్చు చేయడంతో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 7,778 మెగావాట్ల నుంచి 18,567 మెగావాట్లకు  రాష్ట్రం పెంచుకుంది. దీనివల్ల అదనంగా 10,789 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. థర్మల్ లో 5156 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం, సోలార్ విద్యుత్ లో 5273 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని అదనంగా పెంచారు. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన 600 మెగావాట్ల సామర్థ్యం గల కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ , 6X40 మెగైవాట్ల లోయర్ జూరాల,  4X 30 మెగావాట్ల పులిచింతల జలవిద్యుత్ కేంద్రాల ను యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం పూర్తి చేయించింది. దేశంలోనే రికార్డు సమయం 48 నెలల్లో కేటీపీఎస్ ను 7వ దశలో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ కేంద్రాన్ని నిర్మించింది. దేశంలోనే తొలిసారి ప్రభుత్వ రంగంలో నల్గొండ జిల్లా దామరచర్ల లో రూ.34,400 కోట్లతో  5X500 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం చివరినాటికి మొదటి యూనిట్ లో ఉత్పత్తి అందుబాటులోకి రానున్నది. పరిమితంగా ఉన్న 400 కేవీ, 220 కేవీ, 132 కేవీ విద్యుత్ ట్రాన్స్ ఫార్మా ర్ల తో పాటు హై టెన్షన్ లైన్ల పొడవును గణనీయంగా పెంచింది. విద్యుత్ సరఫరా వ్యవస్థ సామర్థ్యాన్ని 39,345 మెగావాల్ట్ యాంప్ కు పెంచింది. 33 కేవీ, 11కేవీ సబ్ స్టేషన్లు తో పాటు లో టెన్షన్ విద్యుత్ పంపిణీ లైన్ల ను భారీగా విస్తరించారు.

  • లోడ్ డిస్పాట్ సెంటర్ అభివృద్ధి

అన్ని రంగాలకు నిరంతర విద్యుత్ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ ను అభివృద్ధి చేసి దేశంలో అత్యుత్తమ విద్యుత్ సరఫరా వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. ఇలాంటి వ్యవస్థ ఉండడంతో 2023 మార్చిలో 15,497 మెగావాట్లకు చేరిన  అత్యధిక విద్యుత్ డిమాండును సైతం తట్టుకుంది. గ్రిడ్ విఫలమైన సందర్భాల్లో కూడా హైదరాబాద్ నగరానికి విద్యుత్ సరఫరాలో అంతరాలను అధిగమించడానికి ఈ ఐలాండ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలో విద్యుత్ అంతరాలు నివారించుటకు 400 కేవీ, 220 కేవీ, 132 కేవీ స్థాయిలలో ఆధునిక ‘రింగ్ మెయిన్ సిస్టమ్స్’ ను నెలకొల్పారు. నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరాతో తెలంగాణ వ్యవసాయ రంగంలో స్వర్ణయుగం ఆవిర్భవించింది. ఈ 9 ఏళ్లలో 8.46 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లును అదనంగా ఏర్పాటు చేశారు. దీంతో 2014 నాటికి 19.03 లక్షలు ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు సంఖ్య 27.49 లక్షలకు పెరిగింది. అన్ని రంగాలకు కలిపి అదనంగా 67 లక్షల విద్యుత్ సరఫరా కనెక్షన్లు ఇచ్చారు. దీంతో మొత్తం విద్యుత్ కనెక్షన్ల సంఖ్య కోటీ 78 లక్షలకు పెరిగాయి. రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి జీవనాడి లాంటి విద్యుత్ రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. 60 ఏoడ్ల సమైక్య పాలనలో జరిగిన వివక్షకు చరమగీతం పడింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, సబ్ స్టేషన్లు, సరఫరా లైన్ల నిర్మాణంతో తలసరి విద్యుత్ వినియోగంలో జాతీయ సగటు (1255 యూనిట్ల) కంటే 70 శాతం ఎక్కువతో 2140 యూనిట్ల సగటుతో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతున్నది.