సింబల్ ఎలక్షన్లలో చూసుకుందాం రండి: రోజా సవాల్

సింబల్ ఎలక్షన్లలో చూసుకుందాం రండి: రోజా సవాల్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఓటమిపాలవడం పట్ల విపక్ష టీడీపీ చేస్తున్న విమర్శలకు మంత్రి రోజా స్పందించారు. చంద్రబాబు, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు రాజీనామా చేసి ఎన్నికలు వస్తారా? అని సవాల్ విసిరారు. సింబల్ పై జరిగే ఎలక్షన్లలో జగన్ కు తిరుగులేదని స్పష్టం చేశారు. 2024లోనూ ప్రజాతీర్పు తమకు అనుకూలంగా వస్తుందని రోజా ధీమా వ్యక్తం చేశారు.  నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని హెచ్చరించారు.

పులివెందులలో జగన్ ను  ఓడించే వారు ఇంకా పుట్టలేదని, వై నాట్ అంటున్న వారు దమ్ముంటే పులివెందుల వచ్చి పోటీ చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామని చెప్పుకుంటూ శునకానందం పొందుతున్నారని రోజా టీడీపీ నేతలపై వ్యంగ్యం ప్రదర్శించారు. ఇప్పుడు ఓటు వేసింది సైకిల్ గుర్తుపై కాదన్న విషయం టీడీపీ నేతలు గ్రహించాలని హితవు పలికారు.  ఉత్తరాంధ్రలో పట్టభద్రుల ఎమ్మెల్సీ విజేత వేపాడ చిరంజీవిరావు టీడీపీ తరఫున కాకుండా స్వతంత్రంగా పోటీ చేసి ఉంటే ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చేవని రోజా పేర్కొన్నారు.