పేదల కోసం పనిచేసిన పార్టీ కాంగ్రెస్ - ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

పేదల కోసం పనిచేసిన పార్టీ కాంగ్రెస్ - ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:పేదల కోసం పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భూపాలపల్లిలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు దేవన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని, కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు స్వీట్లు పంచి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావాన్ని పురస్కరించుకుని రక్తదానాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పేదలకోసం పుట్టిన కాంగ్రెస్ పార్టీకి ప్రాణాలు త్యాగం చేసిన చరిత్ర ఉందన్నారు. దేశంలో ఎలాంటి రాజకీయ పార్టీలు లేని పరిస్థితులలో నెహ్రూ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారని కొనియాడారు. ఇందిరాగాంధీ హయాంలో ప్రభుత్వ భూములను పేదలకు పంచి, పట్టాలు అందజేశారన్నారు. ప్రైవేటు బ్యాంకులను వాణిజ్య బ్యాంకులుగా చేసి, రైతులకు రుణాలను అందించి ఆదుకోవడం జరిగిందన్నారు. పేదలకోసం పాటుపడింది కేవలం కాంగ్రెస్ పార్టీయేనని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.