అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసుల కొరడా    

అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసుల కొరడా    
  • 184 దస్త్రాలు స్వాధీనం               
  • 14 కేసులు నమోదు                      

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా జీరో ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ అధిక వడ్డీ వసూలు చేస్తున్న వడ్డీ వ్యాపారస్తుల ఇళ్లపై,ఆఫీసులపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడిలో 184 ప్రామిసరీ నోట్లు, 12 చెక్కులు స్వాధీనం చేసుకున్నారు.14 మంది వడ్డీ వ్యాపారస్తులపై కేసు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ అధిక వడ్డీ వసూలు చేస్తున్న వడ్డీ వ్యాపారస్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ సింధుశర్మ హెచ్చరించారు.అక్రమ మార్గాల ద్వారా, అధిక వడ్డీల ద్వారా అమాయక ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.

 

జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు, మోసపూరిత మాటల ద్వారా మరికొందరు వ్యాపారులు అమాయక ప్రజలను చూసి ఆర్థిక సహాయం చేస్తామని తెలుపుతూ వారి వద్ద నుండి ఇల్లు మరియు ప్లాటు వ్యవసాయ భూముల దస్తావేజులను తీసుకొని  అప్పులు  ఇస్తున్నారని అన్నారు.  తిరిగి డబ్బులు చెల్లించాలని అధిక వడ్డీ రేట్ల లెక్కలు చూపుతూ చెల్లించలేని పరిస్థితులను తీసుకువస్తూ వారి ఆస్తుల దస్తావేజులను జప్తు చేసుకోవడం జరుగుచున్నదని, ఇలా వ్యాపారం చేస్తున్నారనే  సమాచారం ఉన్న  వ్యాపారులందరిపై జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో దాడులు చేయడం జరిగిందని తెలిపారు.  తనిఖీలలో పట్టుబడ్డ ఆధారాలను పరిగణలోకి తీసుకొని ఇలాంటి అక్రమ వ్యాపారాలు చేస్తున్న వారిపై కామారెడ్డి  జిల్లా వ్యాప్తంగా 14 కేసులు నమోదు చేశామన్నారు.

వ్యాపారులు చేస్తున్న ఆర్థిక మోసాలను తట్టుకోలేక ఎంతోమంది బాధితులు కుటుంబ సమేతంగా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందని, ఇలాంటి ఆత్మహత్యలను నివారించాలనే ఉద్దేశంతోనే అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మోసపూరిత వ్యాపారులపై దాడులు చేయడం జరిగిందని తెలిపారు. చట్ట వ్యతిరేక  చర్యలు పాలు పడితే కఠిన చర్యలు తీసుకుంటామని  జిల్లా ఎస్పీ సిహెచ్ సింధు శర్మ ఐపీఎస్ హెచ్చరించారు.