రామయ్య విగ్రహ ప్రతిష్ట వేళ ప్రధాని కీలక ప్రకటన
ముద్ర,సెంట్రల్ డెస్క్:- అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం విజయవంతంగా ముగిసి దేశరాజధానికి తిరిగి వచ్చిన క్షణాల్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'బిగ్ అనౌన్స్మెంట్' చేశారు. పేద ప్రజల సంక్షేమం కోసం 'ప్రధాన మంత్రి సూర్యోదయ్ యోజన' అనే కొత్త పథకానికి ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు.ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఒక కోటి రూఫ్టాప్ సోలార్ సిస్టమ్లను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు.
అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగిన శుభ తరుణంలోనే దేశ ప్రజలకు సోలర్ రూఫ్ సిస్టమ్ సదుపాయం కల్పించాలనే దృఢ సంకల్పం కలిగిందని చెప్పారు. అయోధ్య నుంచి తిరిగి వచ్చిన వెంటనే తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు చెప్పారు. కోటి ఇళ్లకు ఈ సదుపాయం కల్పించడం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం తగ్గడంతో పాటు ఇంధన రంగంలో స్వయం సమృద్ధి భారత్కు మార్గం మరింత సుగమమవుతుందని ఆ ట్వీట్లో ప్రధాని పేర్కొన్నారు.