ధోనీ అన్ని ఫార్మాట్లలో నా స్థానాన్ని భర్తీ చేసాడు
ధోనీ అన్ని ఫార్మాట్లలో తన స్థానాన్ని భర్తీ చేసాడని టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ అన్నాడు. ధోనీ మానియా ప్రారంభమైన సమయంలో కార్తీక్ తన ఆలోచనలను తాజాగా ఆర్సీబీ పోడ్కాస్ట్లో పంచుకున్నాడు. ధోనీ తాను ఒకేసారి ఇండియా ‘ఎ’ తరపున ఆడామని కార్తీక్ గుర్తుచేసుకున్నాడు. ధోనీ కంటే ముందు తాను జట్టులోకి వచ్చానన్న కార్తీక్... ధోనీ ఓ టూర్లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడని తెలిపాడు. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ధోనీ 148 పరుగులు చేయడంతో మాహీ మానియా మొదలైందని అన్నాడు. మాహీ మానియాలో తనలాంటి వికెట్ కీపర్లు రిజర్వు బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చిందన్నాడు. అయితే దీనిపట్ల తానేం బాధపడటం లేదని ఓ నేషన్ హీరోతో నేను పోటీపడ్డానందుకు గర్వపడతున్నానని కార్తీక్ చెప్పుకొచ్చాడు. 2004 డిసెంబరులో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ తో ధోనీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ధోని అరంగేట్రం చేయడానికి కొన్ని నెలల ముందు అంటే సెప్టెంబర్ లో లార్డ్స్లో ఇంగ్లండ్తో జరిగిన వన్డే మ్యాచ్ తో కార్తీక్ జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం కార్తీక్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం సిద్ధమవుతున్నాడు. అతను ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్నాడు.