Helicopter Crash: కెన్యా మిలటరీ చీఫ్, మరో 9 మంది దుర్మరణం
నైరోబి (Kenya): కెన్యా దేశపు మిలిటరీ బలగాల చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమోండి ఒగోలా ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కుప్పకూలిపోవడంతో మృతి చెందారు. దేశంలోని పశ్చిమ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆయనతో పాటు మరో 9 మంది మృతి చెందినట్టు కెన్యా దేశపు అధికారిక వార్తా సంస్థ కేబీసీ వెల్లడించింది. కెన్యా దేశాధ్యక్షుడు విలియం రూటో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోడానికి సంఘటనా స్థలానికి పరిశోధకుల బృందాన్ని పంపించినట్టు అధ్యక్షుడు తెలిపారు. కెన్యాలోని నార్తర్న్ రిఫ్ట్ ప్రాంతంలోని దళాలను సందర్శించడానికి, అలాగే అక్కడ జరుగుతున్న స్కూల్ రినోవేషన్ పనులను పరిశీలించడానికి జనరల్ ఒగోలా గురువారం మధ్యాహ్నం నైరోబి నుంచి బయల్దేరినట్టు విలియం రూటో పేర్కొన్నారు. ఇది మొత్తం దేశానికి అత్యంత దురదృష్టకరమైన రోజని ఆయన ప్రకటించారు. ఒగోలా, ఇతర సైనికుల మరణంతో దేశంలో మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు సైనికులు ప్రాణాలతో బయటపడ్డారు.