పెట్రోలు పోసుకొని యువకుడు ఆత్మహత్య

పెట్రోలు పోసుకొని యువకుడు ఆత్మహత్య

భూదాన్ పోచంపల్లి,ముద్ర:- ప్రేమించిన యువతి తనను కాదని ఇంకొకరిని ప్రేమిస్తుంటే అది చూసి తట్టుకోలేక మనస్థాపానికి గురై పెట్రోల్ పోసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని పద్మనగర్ కాలనీకి చెందిన చిక్క రాకేష్ (22) హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసుకుని హైదరాబాదులో ఒక ప్రముఖ హోటల్లో పనిచేసేవాడు. అయితే అదే కాలనీకి చెందిన ఓ యువతితో గత ఆరు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నాడు .

రాకేష్ స్నేహితుడైన మరో యువకుడితో ఆ యువతి  చనువుగా ఉండడాన్ని గమనించి ఆ యువతని ప్రశ్నించగా నీకు ఎందుకు నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటా అని సమాధానం ఇచ్చింది. దీంతో రాకేష్ తన స్నేహితుడిని అడగగా దురుసుగా సమాధానం ఇవ్వడంతో ప్రేమించిన యువతి దూరమైందని మనస్థాపానికి గురై ఈ నెల 14న అర్ధరాత్రి కుటుంబ సభ్యులను రూమ్ లో వేసి గొల్లం పెట్టి నన్ను ప్రేమించిన అమ్మాయి నన్ను మోసం చేసిందని అరుస్తూ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. చిక్క రాకేష్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు.